logo

Pawan kalyan: అందరి నోట.. పవన్‌ మాట: జనసేనాని విజయం.. మెజార్టీపై ఆసక్తి

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ గెలుపుపై రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. పిఠాపురంలో ఎన్నడూలేని విధంగా 86.63శాతం పోలింగ్‌ నమోదైంది. అర్ధరాత్రి వరకూ మహిళలు సైతం పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు దీరారు.

Updated : 04 Jun 2024 09:42 IST

పిఠాపురం, న్యూస్‌టుడే: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ గెలుపుపై రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. పిఠాపురంలో ఎన్నడూలేని విధంగా 86.63శాతం పోలింగ్‌ నమోదైంది. అర్ధరాత్రి వరకూ మహిళలు సైతం పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు దీరారు. ఈ నేపథ్యంలో పవన్‌ గెలుపు ఏ విధంగా ఉంటుందనే చర్చ జరుగుతుంది. మరోవైపు జూన్‌ ఒకటిన వెలువడిన ఎగ్జిట్‌ పోల్స్‌ భిన్నంగా ఉన్నాయి. అత్యధిక సర్వే సంస్థలు పవన్‌ కల్యాణ్‌ భారీ మెజార్టీతో విజయం సాధిస్తారని వెల్లడించాయి. మరికొన్ని సర్వేలు వైకాపా అభ్యర్థిని వంగా గీత గెలుస్తారని  అంచనాలు వేశారు. పవన్‌ కూటమి ఏర్పాటులో ముఖ్య పాత్ర వహించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అధిక సీట్లలోనూ జనసేన అభ్యర్థులను బరిలో నిలిపారు. విస్తృతంగా పర్యటించి సభలు నిర్వహించారు. తాను పోటీ చేసిన పిఠాపురం నియోజకవర్గంలో అన్ని ప్రాంతాలు కలియదిరిగి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. వారికి భరోసా ఇచ్చారు. ఈ నేపథ్యంలో అనేకమంది మద్దతు పలికారు. ఆయన గెలుపు ఏ విధంగా ఉంటుందనే దానిపై బెట్టింగ్‌లు సైతం జరుగుతున్నాయి. పవన్‌ గెలిస్తే ఒక చరిత్ర సృష్టిస్తారన్నది ప్రధానంగా వినిపిస్తున్న మాట. ఈ నేపథ్యంలో పిఠాపురానికి కూడా దేశంలో ప్రత్యేక స్థానం నెలకొంటుంది. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే వర్మ.. పవన్‌ 60వేల మెజార్టీతో గెలుస్తారని ప్రకటించారు. గెలుపు, మెజార్టీ పరంగా పవన్‌ కల్యాణ్‌ విజయం కొన్నాళ్లపాటు నిలిచిపోయేలా ఉంటుందని సామాజిక మాధ్యమాల్లోనూ వైరల్‌ అవుతోంది. నెటిజన్లు సైతం ఆయన గెలుపు ఖాయమంటూ పోస్టులు పెడుతున్న తరుణంలో మంగళవారం వచ్చే ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని