Crime News: జగిత్యాల జిల్లాలో విషాదం.. అన్నదమ్ములను బలిగొన్న భూ తగాదా

భూ తగాదాల నేపథ్యంలో జరిగిన గొడవ ఓ కుటుంబంలో విషాదం నింపింది. 

Published : 17 May 2024 16:19 IST

బుగ్గారం: భూ తగాదాల నేపథ్యంలో జరిగిన గొడవ ఓ కుటుంబంలో విషాదం నింపింది. ఇద్దరు అన్నదమ్ముల కుమారులు మృతి చెందడంతో జగిత్యాల జిల్లా గోపులాపూర్‌ గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఎస్సై శ్రీధర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. బుగ్గారం మండలం గోపులాపూర్‌కు చెందిన దివిటి శ్రీనివాస్ రెండేళ్ల క్రితం తన ఇంటి పక్కనే మరో ఇంటిని కొనుగోలు చేశాడు. దాని పక్కనే అదే గ్రామానికి చెందిన బుర్రా నవీన్ ఇల్లు కూడా ఉంది. దీంతో ఇంటి రహదారి విషయంలో నవీన్‌, శ్రీనివాస్‌కు తరచూ గొడవలు జరుగుతున్నాయి. గురువారం రాత్రి శ్రీనివాస్, నవీన్ కుటుంబాల మధ్య చిన్నపాటి గొడవ జరిగి సద్దుమణిగింది.

అనంతరం శ్రీనివాస్ తన పెదనాన్న కుమారుడు మహేష్ ఇంటికి వెళ్లాడు. ఇద్దరు మాట్లాడుకుంటుండగా.. నవీన్ కొంతమంది యువకులను తీసుకొచ్చి.. శ్రీనివాస్‌పై దాడి చేశాడు. ఈ ఘటనలో శ్రీనివాస్(36) అక్కడికక్కడే మృతి చెందాడు. అడ్డువచ్చిన మహేష్‌పై కూడా దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. అతడిని వరంగల్‌లోని ఓ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మహేష్‌కు కుమారుడు, భార్య ఉన్నారు. శ్రీనివాస్ సోదరి మమత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. సంఘటన స్థలాన్ని అదనపు ఎస్పీ వినోద్ కుమార్ పరిశీలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని