సహజీవనం చేస్తున్న మహిళ పిల్లలపై అత్యాచారం

ఓ మహిళతో సహజీవనం చేస్తూ.. ఆమె ముగ్గురు పిల్లలపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి రాజేంద్రనగర్‌ పోక్సో కోర్టు గురువారం 20 ఏళ్ల జైలుశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది.

Updated : 28 Jun 2024 05:17 IST

నిందితుడికి 20 ఏళ్ల జైలుశిక్ష

నర్సింహులు

రాజేంద్రనగర్‌: ఓ మహిళతో సహజీవనం చేస్తూ.. ఆమె ముగ్గురు పిల్లలపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి రాజేంద్రనగర్‌ పోక్సో కోర్టు గురువారం 20 ఏళ్ల జైలుశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. చందానగర్‌ ఠాణా పరిధిలో రెండేళ్ల కిందట జరిగిన ఈ కేసుకు సంబంధించిన వివరాలను ప్రత్యేక ప్రాసిక్యూటర్‌ వెంకటేశ్వర్‌రెడ్డి వెల్లడించారు. సంగారెడ్డి జిల్లా అందోలు మండలం నాగులాపురానికి చెందిన నల్లోల నర్సింహులు హైదరాబాద్‌లో నివసించేవాడు. అప్పటికే వివాహమైన ఓ మహిళ తన భర్తకు అనారోగ్యం ఉండటంతో గాంధీలో చేర్పించి చికిత్స చేయిస్తోంది. ఆమెకు నర్సింహులుతో పరిచయం ఏర్పడింది. అతడితో సహజీవనం చేసింది. ఆ మహిళకు 8, 11 ఏళ్ల ఇద్దరు కుమార్తెలు, ఐదేళ్ల కుమారుడున్నారు. వీరంతా ఒకే గుడిసెలో నివసించేవారు. ఆమె లేని సమయంలో ఇంట్లో ఒకరికి తెలియకుండా ఒకరిపై నర్సింహులు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఓ బాలిక ఆరోగ్యం క్షీణించగా పక్కనే నివసించే మరో మహిళ ఆరా తీయడంతో అసలు విషయం బయటపడింది. విషయాన్ని తల్లికి చెప్పి 2022 జూన్‌ 6న చందానగర్‌ ఠాణాలో ఫిర్యాదు చేయించారు. విచారించిన పోలీసులు సాక్ష్యాధారాలతో కోర్టులో నిరూపించారు. ఈ అమానవీయ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన రాజేంద్రనగర్‌ ప్రత్యేక పోక్సో కోర్టు జడ్జి ఆంజనేయులు నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష విధించారు. బాధిత బాలికలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున, బాలుడికి రూ.50 వేల పరిహారం ప్రకటించారు. పిల్లల్ని తల్లి వదిలేసి వెళ్లగా, వారు ప్రభుత్వ సంరక్షణహోంలో ఉన్నారు. ఇదిలాఉంటే నిందితుడికి హెచ్‌ఐవీ పాజిటివ్‌ అని వైద్య పరీక్షల్లో తేలింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు