Visakha Express: విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో లైంగిక దాడికి యత్నం.. రైలు నుంచి పడి యువతికి గాయాలు

విశాఖ ఎక్స్‌ప్రెస్‌ రైల్లో మద్యం మత్తులో ఓ యువకుడు ప్రయాణికురాలిపై లైంగిక దాడికి యత్నించిన ఘటన కలకలం రేపింది.

Updated : 09 Jul 2024 22:12 IST

మిర్యాలగూడ: విశాఖ ఎక్స్‌ప్రెస్‌ రైల్లో మద్యం మత్తులో ఓ యువకుడు ప్రయాణికురాలిపై లైంగిక దాడికి యత్నించిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనలో మహిళకు తీవ్రగాయాలయ్యాయి. రైల్వే పోలీసుల కథనం ప్రకారం.. సికింద్రాబాద్‌ నుంచి భువనేశ్వర్‌ వెళ్లే విశాఖ ఎక్స్‌ప్రెస్‌ మంగళవారం రాత్రి 7గంటలకు మిర్యాలగూడ స్టేషన్‌కు చేరుకుంది.  రైల్వే స్టేషన్‌ సమీపంలోకి రాగానే రైలు వేగం తగ్గింది.  అదే సమయంలో ఎస్‌-2 బోగీలో ప్రయాణిస్తున్న ఓ మహిళ వాష్‌రూమ్‌ నుంచి తన సీటు వద్దకు వెళ్తుండగా డోర్‌ వద్ద మద్యం మత్తులో ఉన్న ఒడిశాకు చెందిన బిశ్వాస్‌.. ఆమె నడుము పట్టుకుని కిందకు లాగాడు. ఈ క్రమంలో ప్రయాణికురాలు రైలు నుంచి కిందపడిపోయింది. కొద్ది దూరం వెళ్లిన తర్వాత బిశ్వాస్‌ కూడా రైలు నుంచి కిందపడ్డాడు.

గాయపడిన బాధితురాలు సమీపంలోని తండా వద్దకు నడుచుకుంటూ వెళ్లి స్థానికులకు విషయం చెప్పింది. వారు వెంటనే రైల్వే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రైల్వే ఎస్‌ఐ పవన్‌ కుమార్‌రెడ్డి సిబ్బందితో ఘటనా స్థలికి చేరుకొని మహిళను అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. రైలు పట్టాలపై కొంత దూరంలో మద్యం మత్తులో పడి ఉన్న బిశ్వాస్‌ను మరో అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆమె శ్రీకాకుళం జిల్లాలో ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నట్టు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని