Crime news: విజయవాడలో దారుణం.. మందలించాడనే కోపంతో ప్రియురాలి తండ్రిని చంపేశాడు

విజయవాడ బృందావన్‌ కాలనీలో హత్య జరగడం కలకలం రేపింది. సింధు భవన్‌ వద్ద కిరాణా వ్యాపారి దారుణ హత్యకు గురయ్యాడు.

Updated : 28 Jun 2024 12:13 IST

కృష్ణలంక: తన కుమార్తెతో ప్రేమ వ్యవహారం వద్దని మందలించిన వ్యక్తిపై కక్ష పెంచుకున్నాడో యువకుడు. పథకం ప్రకారం అతడిని కడతేడ్చాడు. ఈ ఘటన విజయవాడలోని కృష్ణలంక పరిధిలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బృందావన్‌ కాలనీలోని సింధూభవన్‌ వీధిలో కంకిపాటి శ్రీరామ్‌ప్రసాద్‌ (56) వంశీ జనరల్‌ స్టోర్‌ నిర్వహిస్తున్నాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు. వీరు విధ్యాధరపురం చెరువు సెంటర్‌లో నివాసముంటున్నారు. పెద్దకుమార్తె దర్శిని (22) విజయవాడలోని శ్రీపొట్టి శ్రీరాములు ఇంజినీరింగ్‌ కళాశాలలో ఆఖరి సంవత్సరం చదువుతోంది. తన స్నేహితురాలు హరిత ద్వారా ఆమెకు గడ్డం శివమణికంఠతో నాలుగేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. వివాహం చేసుకుందామని ఇద్దరూ నిర్ణయానికి వచ్చారు. ఇదే విషయాన్ని కుటుంబసభ్యులకు తెలిపారు. వేర్వేరు కులాలు కావడంతో వారు అంగీకరించలేదు.

ఈ ఏడాది ఫిబ్రవరిలో శ్రీరామ్‌ప్రసాద్‌ కొందరు వ్యక్తులతో కలిసి శివమణికంఠను మందలించాడు. ప్రేమ వ్యవహారానికి దూరంగా ఉండాలని యువకుడి తల్లి కూడా అతడిని వారించింది. దీంతో కోపోద్రిక్తుడైన శివమణికంఠ.. గురువారం రాత్రి 9 గంటల సమయంలో దుకాణం మూసివేసి ఇంటికి వెళ్తున్న శ్రీరామ్‌ప్రసాద్‌పై కత్తితో దాడికి పాల్పడ్డాడు. కిందపడిన ఆయనపై పలుమార్లు కత్తితో పొడిచాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే శ్రీరామ్‌ప్రసాద్‌ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కృష్ణలంక పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతరం నిందితుడిని అరెస్టు చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని