Naresh Goyal: ‘ఆశలన్నీ కోల్పోయా.. చనిపోవడం మేలు..!’ జెట్‌ ఎయిర్‌వేస్‌ వ్యవస్థాపకుడు కన్నీరుమున్నీరు

జీవితంపై ఆశలన్నీ కోల్పోయానని, బతకడం కంటే చనిపోవడం మేలని.. జెట్‌ ఎయిర్‌వేస్‌ వ్యవస్థాపకుడు నరేశ్‌ గోయల్‌ కోర్టులో కంటతడి పెట్టారు.

Published : 06 Jan 2024 23:04 IST

ముంబయి: ‘‘జీవితంపై ఆశలన్నీ కోల్పోయా. ప్రస్తుత పరిస్థితుల్లో బతకడం కంటే జైల్లోనే చనిపోవడం మేలు..!’’ అంటూ జెట్‌ ఎయిర్‌వేస్‌ (Jet Airways) వ్యవస్థాపకుడు నరేశ్‌ గోయల్‌ (Naresh Goyal) కోర్టులో కన్నీరుమున్నీరయ్యారు. కెనరా బ్యాంకుకు సంబంధించి రూ.538 కోట్ల మనీలాండరింగ్‌ కేసులో ‘ఈడీ’ ఆయన్ను అరెస్టు చేయగా.. ప్రస్తుతం ముంబయిలోని ఆర్థర్‌ జైల్లో జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్నారు. బెయిల్‌ పిటిషన్‌పై విచారణ సందర్భంగా శనివారం ప్రత్యేక కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కొద్దిసేపు వ్యక్తిగత విచారణకు అభ్యర్థించగా.. న్యాయమూర్తి ఎంజీ దేశ్‌పాండే అనుమతించారు.

‘‘నా భార్యకు క్యాన్సర్‌ ముదిరిపోయింది. ఆమెను చాలా మిస్‌ అవుతున్నా. ఒక్కగానొక్క కుమార్తె కూడా అనారోగ్యంతో ఉంది. వారిని చూసుకునేందుకు ఎవరూ లేరు. నేనూ బలహీనంగా ఉన్నా. ఆరోగ్యం క్షీణిస్తోంది. జేజే హాస్పిటల్‌కు తీసుకెళ్తోన్నా.. సమయానికి సేవలు అందడం లేదు. ఇవన్నీ ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయి. ఆ ఆస్పత్రికి పంపొద్దు. ఇటువంటి పరిస్థితుల్లో జీవించడం కంటే.. జైల్లోనే చనిపోయేందుకు అనుమతించండి’’ అని న్యాయమూర్తి ఎదుట చేతులు జోడించి, విలపించినట్లు న్యాయస్థానం రోజువారీ విచారణల రికార్డుల్లో నమోదయ్యింది.

జెట్‌ ఎయిర్‌వేస్‌ వ్యవస్థాపకుడు నరేశ్‌ గోయల్‌ అరెస్టు

నరేశ్‌ గోయల్‌ తన పరిస్థితులను వివరిస్తున్నప్పుడు వణుకుతున్నట్లు గుర్తించానని న్యాయమూర్తి ఎంజీ దేశ్‌పాండే కోర్టు రికార్డుల్లో ప్రస్తావించారు. నిస్సహాయ స్థితిలో వదిలేయబోమని, మానసిక, శారీరక ఆరోగ్యాన్ని కాపాడేందుకు సరైన చికిత్స అందించే విషయంలో ఆయనకు భరోసా ఇచ్చినట్లు చెప్పారు. ఈ మేరకు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా గోయల్‌ తరఫు న్యాయవాదులను ఆదేశించారు. మరోవైపు.. ఆయన బెయిల్ పిటిషన్‌పై ఈడీ ప్రతిస్పందనను దాఖలు చేసింది. జనవరి 16న ఈ అంశం తదుపరి విచారణకు రానుంది.

దేశీయ విమానయాన సంస్థ ‘జెట్‌ ఎయిర్‌వేస్‌’కు కెనరా బ్యాంకు మొత్తం 848.86 కోట్లు రుణం ఇచ్చింది. అయితే అందులో 538.62 కోట్లు కంపెనీ తిరిగి చెల్లించలేదు. దీంతో కెనరా బ్యాంకు కేసు పెట్టింది. సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి విచారణ చేపట్టింది. జెట్‌ ఎయిర్‌వేస్‌ మోసం చేసినట్లు తేల్చింది. ఈ కేసులో మనీలాండరింగ్‌ అంశాలు తేలడంతో ఈడీ సైతం దర్యాప్తు చేపట్టింది. గతేడాది సెప్టెంబరు 1న నరేశ్‌ గోయల్‌ను అరెస్టు చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు