credit score: క్రెడిట్‌ స్కోరు ఈ సంగతులు తెలుసుకోండి

ప్రతి చిన్న అవసరానికీ అప్పు తీసుకుంటున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. క్రెడిట్‌ బ్యూరో ఎక్స్‌పీరియన్‌ ఇండియా నివేదిక ప్రకారం గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రుణ వితరణలో 19 శాతం వరకూ వృద్ధి నమోదయ్యింది.

Published : 05 Jul 2024 00:37 IST

ప్రతి చిన్న అవసరానికీ అప్పు తీసుకుంటున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. క్రెడిట్‌ బ్యూరో ఎక్స్‌పీరియన్‌ ఇండియా నివేదిక ప్రకారం గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రుణ వితరణలో 19 శాతం వరకూ వృద్ధి నమోదయ్యింది. వ్యక్తులు రుణం తీసుకున్నప్పుడు వారి క్రెడిట్‌ స్కోరును ఆర్థిక సంస్థలు పరిశీలిస్తుంటాయి. కొన్నేళ్లుగా మారిన సాంకేతికత, నిబంధనలు క్రెడిట్‌ స్కోరును లెక్కించే తీరును మార్చేశాయి. దీంతో దీన్ని ప్రభావితం చేసే అంశాలూ మారాయి.

దేశంలో క్రెడిట్‌ రేటింగ్‌ ఏజెన్సీలు ఇప్పుడు ఎంతో కీలకంగా మారాయి. కొన్ని కోట్లమంది జీవితాల్లో ఇవి ఇప్పుడు అంతర్భాగం అయ్యాయి. వినియోగదారుల క్రెడిట్‌ నివేదికలను రూపొందించేందుకు ఇవి ఎంతో సమాచారాన్ని సేకరిస్తున్నాయి. విశ్లేషిస్తున్నాయి. ట్రాన్స్‌యూనియన్‌ సిబిల్, క్రిఫ్‌ హై మార్క్‌ క్రెడిట్‌ ఇన్షర్మేషన్‌ సర్వీసెస్, ఈక్విఫాక్స్‌ క్రెడిట్‌ ఇన్ఫర్మేషన్‌ సర్వీసెస్, ఎక్స్‌పీరియన్‌ క్రెడిట్‌ ఇన్ఫర్మేషన్‌ కంపెనీ ఆఫ్‌ ఇండియా ప్రధానంగా క్రెడిట్‌ స్కోరును అందిస్తున్నాయి. ఈ సంస్థలు తాము సేకరించే సమాచారంతోపాటు, అవి గణించే విధానాన్ని బట్టి క్రెడిట్‌ స్కోరును ఇస్తుంటాయి. కాబట్టి, ఈ సంస్థలు ఇచ్చే క్రెడిట్‌ స్కోరులో వ్యత్యాసం కనిపించే అవకాశాలు ఉంటాయి. 

మారుతూనే ఉంటుంది..

‘క్రెడిట్‌ స్కోరును ఆరు నెలలకోసారి లేదా ఏడాదికోసారి లెక్కించరు. ఇది ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. మీ క్రెడిట్‌ రిపోర్టు కావాలని కోరినప్పుడు అప్పటికి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు నివేదిక అందుతుంది. అప్పును తిరిగి చెల్లించడం, కొత్త రుణం కోసం దరఖాస్తు, వాయిదాల చెల్లింపులో ఆలస్యం ఇలా మీ చర్యల వల్ల క్రెడిట్‌ స్కోరు మారేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి’ అని ఎక్స్‌పీరియన్‌ ఇండియా కంట్రీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ మనీశ్‌ జైన్‌ వివరించారు. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు తమ వద్ద ఉన్న సమాచారాన్ని పంపినప్పుడల్లా స్కోరు మారిపోతుందని తెలిపారు.

అవసరం లేకపోయినా..

చాలామంది అవసరం లేకపోయినా పలు రుణయాప్‌లు, బ్యాంకింగ్‌ యాప్‌లలో రుణం కోసం దరఖాస్తు చేస్తూ ఉంటారు. చివరి నిమిషంలో దాన్ని వద్దనుకుంటారు. ఇవన్నీ కూడా క్రెడిట్‌ స్కోరుపై ప్రభావం చూపిస్తుంటాయి. కచ్చితంగా చెప్పాలంటే.. మీరు రుణం కోసం దరఖాస్తు చేసిన ప్రతిసారీ మీ స్కోరుపై అది ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తూనే ఉంటుంది. కాబట్టి, తప్పనిసరి పరిస్థితుల్లోనే రుణం కోసం దరఖాస్తు చేయడం మేలు.

వినియోగం పరిమితంగా..

మీ క్రెడిట్‌ వినియోగ నిష్పత్తి కూడా మీ స్కోరుపై ప్రభావితం చూపిస్తుంటుంది. ఉదాహరణకు మీ దగ్గర మూడు క్రెడిట్‌ కార్డులున్నాయని అనుకుందాం. మీరు ఈ మూడు కార్డుల్లోనూ 80 శాతం పరిమితిని వినియోగించుకున్నారు. దీన్ని బ్యూరోలు అధిక క్రెడిట్‌ వినియోగంగా పరిగణిస్తాయి. ఒక క్రెడిట్‌ కార్డులో 80 శాతం, మిగతా వాటిని ఉపయోగించకపోతే.. పెద్దగా ప్రభావం ఉండదు. అదే మూడు కార్డుల్లో ఒక్కో కార్డులో 30 శాతం వరకే వినియోగిస్తే.. క్రెడిట్‌ స్కోరు మెరుగ్గా ఉంటుంది. 

తనిఖీ చేసుకోవాలి..

క్రెడిట్‌ స్కోరును తెలుసుకున్నప్పుడల్లా.. స్కోరు తగ్గుతుందనే అపోహ ఉంది. ఇది వాస్తవం కాదు. ఉచితంగా క్రెడిట్‌ నివేదికను పొందే అవకాశం క్రెడిట్‌ బ్యూరోలు కల్పిస్తున్నాయి. రుణ వాయిదాలు చెల్లిస్తున్న వారు కనీసం ఆరు నెలలకోసారైనా ఈ నివేదికను తీసుకోవడం మంచిది. మీరు చెల్లిస్తున్న రుణ వాయిదాలన్నీ సక్రమంగా నమోదవుతున్నాయా లేదా అనేది తెలుస్తుంది.

694 దాటితే...

చాలా బ్యాంకులు 750కి మించి స్కోరున్న రుణదాతలకు ప్రాధాన్యం ఇస్తాయి. కానీ, 694 పాయింట్ల దగ్గర్నుంచీ రుణాలు ఇచ్చేందుకు వాటికి ఇబ్బంది ఉండదు. కాకపోతే.. వడ్డీ రేటు అర శాతం వరకూ అధికంగా ఉండొచ్చు. కొన్ని బ్యాంకులు 645 పాయింట్లు ఉన్నప్పటికీ రుణాలు ఇచ్చేందుకు ముందుకు వస్తాయి. 750కి మించి స్కోరుంటే.. రుణాలు పొందడంలో ఎలాంటి ఇబ్బందీ లేదు.

రుణం తీర్చినా..

బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థల దగ్గర తీసుకున్న రుణాన్ని తీర్చేసినా కొన్ని రోజుల వరకూ అది క్రెడిట్‌ నివేదికలో కనిపించే అవకాశం ఉంది. అలాంటప్పుడు మీ స్కోరు 
పెరిగినట్లు కనిపించకపోవచ్చు. రుణం ముందే తీర్చినా, బదిలీ చేసుకున్నా అది క్రెడిట్ నివేదికలో కనిపించాలి. ఒకవేళ కనిపించకపోతే వెంటనే బ్యాంకు/ఆర్థిక సంస్థను సంప్రదించి, రుణం ముగించినట్లు నమోదు చేయాలని అడగాలి. లేకపోతే రెండు మూడు రుణాలు ఉన్నట్లు కనిపిస్తూ ఉంటుంది.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని