SEBI: మదుపర్లకు మెయిల్‌ ద్వారానే ఖాతా స్టేట్‌మెంట్‌లు

మదుపర్లకు ఏకీకృత ఖాతా వివరాలను (కన్సాలిడేటెడ్‌ అకౌంట్‌ స్టేట్‌మెంట్‌- క్యాస్‌) నమోదిత ఇ-మెయిల్‌ ద్వారానే డిపాజిటరీస్, మ్యూచువల్‌ ఫండ్‌- రిజిస్ట్రార్‌ అండ్‌ ట్రాన్స్‌ఫర్‌ ఏజెంట్స్‌ (ఎంఎఫ్‌- ఆర్‌టీఏ) పంపించాల్సి ఉంటుందని సెబీ తెలిపింది.

Updated : 03 Jul 2024 08:03 IST

డిపాజిటరీస్, ఎంఎఫ్‌-ఆర్‌టీఏలకు సెబీ సూచన

దిల్లీ: మదుపర్లకు ఏకీకృత ఖాతా వివరాలను (కన్సాలిడేటెడ్‌ అకౌంట్‌ స్టేట్‌మెంట్‌- క్యాస్‌) నమోదిత ఇ-మెయిల్‌ ద్వారానే డిపాజిటరీస్, మ్యూచువల్‌ ఫండ్‌- రిజిస్ట్రార్‌ అండ్‌ ట్రాన్స్‌ఫర్‌ ఏజెంట్స్‌ (ఎంఎఫ్‌- ఆర్‌టీఏ) పంపించాల్సి ఉంటుందని సెబీ తెలిపింది. ఇ-మెయిల్‌ ద్వారా ఈ వివరాలు పంపడం  తప్పనిసరి చేసింది. 2025 ఏప్రిల్‌ 1 నుంచి ఈ కొత్త విధానం అమల్లోకి వస్తుందని పేర్కొంది. క్యాస్‌ అనేది ఒకటి లేదా సంయుక్త ఖాతాల స్టేట్‌మెంట్‌. ఇందులో ఆ నెలలో మదుపర్లు మ్యూచువల్‌ ఫండ్‌ విభాగంలో జరిపిన ఆర్థిక లావాదేవీల వివరాలతో పాటు, డీ-మ్యాట్‌లో ఉన్న ఇతర సెక్యూరిటీల వివరాలు ఉంటాయి. ఆర్‌టీఏలు, డిపాజిటరీస్‌ వద్ద పాన్‌ వివరాలు ఒకేలా ఉన్నట్లయితే.. మ్యూచువల్‌ ఫండ్‌ ఫోలియోలు, డిపాజిటరీ ఖాతాల్లోని ఆర్థిక లావాదేవీల వివరాలను పొందుపర్చిన క్యాస్‌ను మదుపర్లకు డిపాజిటరీస్‌ (ఎన్‌సీడీఎల్, సీడీఎస్‌ఎల్‌) పంపిస్తుంటాయి. ఒకవేళ పాన్‌ వివరాలు వేర్వేరుగా ఉంటే.. మ్యూచువల్‌ ఫండ్‌ ఫోలియోస్‌కు సంబంధించి కేవలం మ్యూచువల్‌ ఫండ్‌ లావాదేవీల వివరాలతో కూడిన క్యాస్‌ను మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలు పంపిస్తాయి. ‘డిజిటల్‌ సాంకేతికత విస్తృతి పెరిగిన నేపథ్యంలో ఏదేని సమాచారం పంపాలంటే ప్రస్తుతం ఎలక్ట్రానిక్‌ పద్ధతికే ప్రాధాన్యం ఇస్తున్నారు. పర్యావరణ హిత చర్యల్లో భాగంగానూ; నియంత్రణ మార్గదర్శకాలను సరళవంతం చేసే ఉద్దేశంతో క్యాస్‌ను డిపాజిటరీలు, ఎంఎఫ్‌-ఆర్‌టీఏలు ఇ-మెయిల్‌ ద్వారా పంపడం తప్పనిసరి చేయాలని నిర్ణయించామ’ని సెబీ తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని