Andhra News: అమ్మ వెంకటరెడ్డీ.. ఇంత మోసమా?

జగన్‌ ప్రభుత్వంలో సాగిన ఇసుక దోపిడీలో ఆశ్చర్యకరమైన నిజాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ‘ముఖ్య’నేతలు భారీగా ఇసుక సొమ్ము దోచేయగా.. గుత్తేదారు పూర్తిగా డబ్బు చెల్లించకుండా ప్రభుత్వానికి రూ.800 కోట్ల బాకీ ఉండగా.. బకాయి లేదంటూ గనులశాఖ సంచాలకుడు వెంకటరెడ్డి ఏకంగా నో డ్యూ సర్టిఫికెట్‌ జారీచేసేశారు.

Updated : 03 Jul 2024 08:17 IST

రూ.800 కోట్లు బకాయిపడిన జేపీ సంస్థ
బాకీ లేదంటూ ధ్రువపత్రమిచ్చిన మైనింగ్‌ డైరెక్టర్‌ వెంకటరెడ్డి
ఇసుక నోట్‌ఫైల్‌లో కనిపించని ఆ పత్రం వివరాలు
కొత్త గుత్తేదార్లు జీసీకేసీ, ప్రతిమ సైతం రూ.220 కోట్ల బాకీ

ఈనాడు, అమరావతి: జగన్‌ ప్రభుత్వంలో సాగిన ఇసుక దోపిడీలో ఆశ్చర్యకరమైన నిజాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ‘ముఖ్య’నేతలు భారీగా ఇసుక సొమ్ము దోచేయగా.. గుత్తేదారు పూర్తిగా డబ్బు చెల్లించకుండా ప్రభుత్వానికి రూ.800 కోట్ల బాకీ ఉండగా.. బకాయి లేదంటూ గనులశాఖ సంచాలకుడు వెంకటరెడ్డి ఏకంగా నో డ్యూ సర్టిఫికెట్‌ జారీచేసేశారు. ఈ సర్టిఫికెట్‌కు సంబంధించి దస్త్రంలో ఎక్కడా నోట్‌ఫైల్‌ లేకపోవడంతో అధికారులు షాక్‌ తిన్నారు. పూర్వపు సంచాలకుడు వెంకటరెడ్డి మొన్నటివరకు ఇలా చేసిన మోసాలు, వైకాపా పెద్దల దోపిడీకి ఎలా సహకరించారనే నిజాలు ఇప్పుడు బయటపడుతున్నాయి. గత ఐదేళ్లలో ఇసుకలో ఏం జరిగిందనేది వారం రోజులుగా అధికారులు పరిశీలిస్తున్నారు. ఇసుక టెండర్లు, తవ్వకాలు, విక్రయాలు, లావాదేవీల అంశాలన్నీ నిశితంగా అధ్యయనం చేశారు. ఇంతకాలం గోప్యంగా ఉంచిన ఈ వివరాలు చూసి అధికారులు ఆశ్చర్యపోతున్నారు.

బకాయి చెల్లించకపోయినా.. క్లియరెన్స్‌

జయ్‌ప్రకాశ్‌ పవర్‌ వెంచర్స్‌ (జేపీ) 2021 మే నుంచి 2023 నవంబరు వరకు ఇసుక గుత్తేదారుగా ఉంది. దాని ఉపగుత్తేదారుగా టర్న్‌కీ ఎంటర్‌ప్రైజెస్‌ వ్యవహరించింది. ప్రభుత్వానికి చెల్లింపులన్నీ జేపీ సంస్థ ద్వారానే జరిగాయి. తొలుత రెండేళ్లకు రూ.1,528 కోట్లు చెల్లించేలా జేపీ సంస్థ టెండరు దక్కించుకుంది. తర్వాత మరో ఆరు నెలలు కొనసాగడంతో మరో రూ.320 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంది. అంటే మొత్తంగా దాదాపు రూ.1,850 కోట్ల వరకు ప్రభుత్వానికి జేపీ సంస్థ చెల్లించాలి. కానీ రూ.1,059 కోట్లే చెల్లించింది. దీంతో ఇంకా దాదాపు రూ.800 కోట్ల బకాయి ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. ఈ వివరాలన్నీ దాచిపెట్టి.. జేపీ సంస్థ బాకీ లేదంటూ మార్చి 14న గనులశాఖ సంచాలకుడు వెంకటరెడ్డి నో డ్యూ సర్టిఫికెట్‌ జారీచేశారు. అలాగే ఉపగుత్తేదారు టర్న్‌కీ సంస్థ బ్యాంక్‌ గ్యారంటీగా చూపిన రూ.120 కోట్లు విడుదల చేయాలంటూ మార్చి 23న బ్యాంక్‌ మేనేజర్‌కు వెంకటరెడ్డి లేఖ రాశారు. దీంతో ఆ బ్యాంక్‌ గ్యారంటీ కూడా విడుదలైపోయింది.

నోట్‌ ఫైల్‌లో వివరాలేవీ?

ఓ గుత్తేదారు బకాయి మొత్తం చెల్లిస్తే.. దాని వివరాలన్నీ నమోదుచేసి, నో డ్యూ సర్టిఫికెట్‌ ఇస్తున్నట్లు దస్త్రంలో పేర్కొనాలి. కానీ ఇసుక దస్త్రంలో అలాంటి నోట్‌ఫైల్‌ లేదు. కిందిస్థాయి అధికారుల సంతకాలు ఏవీ లేకుండానే.. సంచాలకుడు వెంకటరెడ్డి నేరుగా నో డ్యూ సర్టిఫికెట్‌ జారీచేసినట్లు స్పష్టమవుతోంది. తర్వాత నోట్‌ఫైల్‌ కాపీని ఆ దస్త్రంలో జతచేయాలంటూ కిందిస్థాయి అధికారులకు ఇచ్చే ప్రయత్నం చేయగా, వాళ్లు లొసుగులను గుర్తించి, దానిపై సంతకాలు చేయలేదని, నోట్‌ఫైల్‌లో చేర్చలేదని తెలుస్తోంది.

జీసీకేసీ, ప్రతిమాదీ ఇదే తీరు 

గతేడాది డిసెంబరు నుంచి రాష్ట్రంలో రెండు ప్యాకేజీల్లో ప్రతిమా ఇన్‌ఫ్రా, ఓ ప్యాకేజీలో జీసీకేసీ సంస్థ ఇసుక టెండరు దక్కించుకొని వ్యాపారం చేస్తున్నాయి. ప్రతి 15 రోజులకు అడ్వాన్స్‌గా ఇసుక సొమ్ము చెల్లించాకే విక్రయాలు చేయాలి. కానీ ఈ రెండు సంస్థలు కలిపి ఇప్పటికి రూ.220 కోట్ల వరకు గనులశాఖకు బాకీ ఉన్నాయి. అయినా  మొన్నటివరకు గనులశాఖ సంచాలకునిగా ఉన్న వెంకటరెడ్డి వాటిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు.

సీఎం ముందుకు ఇసుక దోపిడీ వివరాలు 

గతంలో జేపీ సంస్థ పేరిట, ప్రస్తుతం జీసీకేసీ, ప్రతిమ ఇన్‌ఫ్రా పేరిట జరిగిన ఇసుక దోపిడీ వివరాలను గనులశాఖ అధికారులు సీఎం చంద్రబాబు ముందు ఉంచేందుకు సిద్ధమయ్యారు. ఎలా అడ్డగోలుగా దోచేశారు.. నిబంధనలు ఎలా ఉల్లంఘించారు.. టెండరు నిబంధనలు ఎలా పాటించలేదు.. తదితర వివరాలన్నీ చెబుతారు. వీటిపై సిట్‌ వేయాలా? సీఐడీ విచారణకు ఆదేశించాలా? విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌తో విచారణ చేయించాలా? అనేది సీఎం నిర్ణయిస్తారని గనులశాఖ వర్గాలు చెబుతున్నాయి.


అసలు జేపీ చెల్లించింది రూ.250 కోట్లే

గనులశాఖకు జేపీ సంస్థ రూ.1,059 కోట్లు చెల్లించినట్లు రికార్డుల్లో ఉన్నా.. అందులో ఇసుక విక్రయాల ద్వారా వచ్చిన సొమ్ములో జేపీ సంస్థ చెల్లించినది రూ.259 కోట్లేనని అధికారులు గుర్తించారు. జగనన్న ఇళ్ల నిర్మాణానికి జేపీ సంస్థ భారీగా ఇసుక తరలించినట్లు లెక్కలు చూపారు. దీంతో గృహనిర్మాణ సంస్థ రూ.500 కోట్లు గనులశాఖకు చెల్లించింది. అలాగే నాడు-నేడు పనులకు పెద్దఎత్తున ఇసుక సరఫరా చేశామంటూ జేపీ సంస్థ లెక్కలు చూపడంతో వైద్యశాఖ, విద్యాశాఖ కలిపి దాదాపు రూ.300 కోట్ల వరకు గనులశాఖకు చెల్లించాయి. అంటే జేపీ సంస్థ బదులు గృహనిర్మాణ సంస్థ, వైద్య, విద్యాశాఖలు కలిపి రూ.800 కోట్లు గనులశాఖకు రీయింబర్స్‌ చేశాయి. జేపీ సంస్థ రూ.259 కోట్ల నగదే చెల్లించి చేతులు కడిగేసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని వైకాపా ముఖ్యనేతలు నిత్యం లక్షల టన్నుల ఇసుక విక్రయించి, కోట్ల రూపాయలు సొమ్ముచేసుకోగా.. ప్రభుత్వానికి మాత్రం జేపీ సంస్థ తరఫున రూ.250 కోట్లే చెల్లించారనేది స్పష్టమవుతోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని