Ramoji Rao: నేడు రామోజీరావు సంస్మరణ సభ

రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్, పద్మవిభూషణ్‌ అవార్డు గ్రహీత రామోజీరావు సంస్మరణ సభకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక ఏర్పాట్లు చేసింది.

Updated : 27 Jun 2024 06:51 IST

అతిథులుగా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్, కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
పాత్రికేయ దిగ్గజాలు ఎన్‌.రామ్, శేఖర్‌ గుప్తా తదితరులు
ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం 

ఈనాడు, అమరావతి: రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్, పద్మవిభూషణ్‌ అవార్డు గ్రహీత రామోజీరావు సంస్మరణ సభకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక ఏర్పాట్లు చేసింది. విజయవాడ శివారు కానూరు వందడుగుల రోడ్డులోని అనుమోలు గార్డెన్స్‌లో గురువారం సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభమయ్యే సభలో అతిథులుగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్, కేంద్ర రైల్వే, సమాచార ప్రసారాల శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, ప్రముఖ పాత్రికేయులు ఎన్‌.రామ్, శేఖర్‌ గుప్తా, గులాబ్‌ కొఠారి, భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి తదితరులు పాల్గొననున్నారు. పత్రికా రంగంతోపాటు వివిధ రంగాల్లో రామోజీరావు అందించిన విశేష సేవలకు గుర్తింపుగా ఆయన సంస్మరణ సభను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. కృష్ణా జిల్లాలోని మారుమూల గ్రామం పెదపారుపూడిలో జన్మించిన రామోజీరావు.. అంచెలంచెలుగా ఎదిగారు. ‘ఈనాడు’తోపాటు ‘ఈటీవీ’ ప్రసారాలతో మీడియాలో కొత్త ఒరవడి సృష్టించారు. ప్రకృతి విపత్తుల్లో ప్రజల వెన్నంటి నిలిచారు. ‘మార్గదర్శి’తో మధ్యతరగతి ప్రజలకు పొదుపుపై అవగాహన కల్పించారు. సమాజాన్ని మేల్కొలిపే చిత్రాలను ఉషాకిరణ్‌ మూవీస్‌ ద్వారా అందించారు. ఆయన నిర్మించిన రామోజీ ఫిలింసిటీ గిన్నిస్‌ బుక్‌ రికార్డును సొంతం చేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన సంస్మరణ సభకు దేశంలోని వివిధ ప్రాంతాలనుంచి పలువురు ప్రముఖులు హాజరవుతున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కమిటీలను నియమించింది. బుధవారం సాయంత్రానికి సభ నిర్వహణ ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రధాన వేదిక, దాదాపు పది వేల మంది వరకు కూర్చునేలా మూడు భారీ గుడారాలను ప్రభుత్వం ఏర్పాటుచేసింది. వర్షం వచ్చినా ఇబ్బంది లేకుండా సౌకర్యాలు కల్పించింది. సభలో ఉన్న ఏ1 గ్యాలరీలో రామోజీరావు సమీప బంధువులు, మంత్రులు, వీవీఐపీలు, ప్రముఖులు ఉంటారు. ఎం1 గ్యాలరీలో పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, ఇతర ప్రముఖులు ఉంటారు. బీ1 గ్యాలరీని ‘ఈనాడు’ గ్రూపు సంస్థల ప్రతినిధులు, జాతీయ మీడియా ప్రతినిధులు, సినిమా రంగం, ఇతర మీడియా ప్రముఖులకు కేటాయించారు. 

విజయవాడ నగరంలో ఏర్పాటు చేసిన సంస్మరణ సభ ఫ్లెక్సీ

పాల్గొననున్న ప్రముఖులు 

సంస్మరణ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్, కేంద్ర రైల్వే, సమాచార ప్రసారాల శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, రాష్ట్ర సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, ది హిందూ మాజీ ఎడిటర్‌ ఎన్‌.రామ్, రాజస్థాన్‌ పత్రిక ఎడిటర్‌ గులాబ్‌ కొఠారి, ది ప్రింట్‌ ఎడిటర్‌ శేఖర్‌ గుప్తా, ఈనాడు ఎండీ సీహెచ్‌ కిరణ్, సినీ నటులు రాజేంద్రప్రసాద్, జయసుధ, నిర్మాత, నటుడు మురళీమోహన్, దర్శకులు రాఘవేంద్రరావు, ఎస్‌.ఎస్‌.రాజమౌళి, బోయపాటి శ్రీను, సంగీత దర్శకుడు కీరవాణి, నిర్మాతలు అశ్వనీదత్, సురేష్‌బాబు, శ్యాంప్రసాదరెడ్డి, రాష్ట్ర మంత్రులు, ఇతర అధికారులు పాల్గొననున్నారు. సంస్మరణ సభ సందర్భంగా రామోజీరావు జీవిత విశేషాలతో చిత్ర ప్రదర్శన ఏర్పాటుచేశారు.

వేదికపై తెరలు ఏర్పాటు చేస్తున్న సిబ్బంది

సభాప్రాంగణాన్ని పరిశీలించిన మంత్రులు కొలుసు పార్థసారథి, నాదెండ్ల మనోహర్, నిమ్మల రామానాయుడు, సత్యకుమార్‌ యాదవ్, కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే బోడే ప్రసాద్, అధికారులు తదితరులు 

సిద్ధమైన సభా వేదిక

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని