NEET UG: నీట్‌లో 60.84 శాతం ఉత్తీర్ణత

తెలంగాణ నుంచి నీట్‌ యూజీ పరీక్షకు హాజరైన విద్యార్థుల్లో 60.84 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 79,813 మంది దరఖాస్తు చేసుకోగా, 77,849 మంది పరీక్ష రాశారు.

Updated : 05 Jun 2024 07:06 IST

రాష్ట్రంలో 47,371 మందికి అర్హత మార్కులు
100లోపు ర్యాంకుల్లో తెలంగాణకు ఒకటే
అనురన్‌ ఘోష్‌కు 77వ ర్యాంకు
ఎస్‌టీ విభాగంలో టాపర్లు మనోళ్లే
దేశవ్యాప్తంగా 67 మందికి ఒకటో ర్యాంకు
అందులో ఏపీ విద్యార్థులు నలుగురు

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ నుంచి నీట్‌ యూజీ పరీక్షకు హాజరైన విద్యార్థుల్లో 60.84 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 79,813 మంది దరఖాస్తు చేసుకోగా, 77,849 మంది పరీక్ష రాశారు. వారిలో 47,371 మంది కనీస మార్కులు సాధించి ఎంబీబీఎస్, బీడీఎస్‌ తదితర కోర్సుల్లో ప్రవేశానికి అర్హత సాధించారు. రాష్ట్రం నుంచి ఈసారి 100లోపు ర్యాంకుల్లో కేవలం ఒకటి మాత్రమే దక్కింది. హైదరాబాద్‌ నుంచి పరీక్ష రాసిన అనురన్‌ ఘోష్‌ 77వ ర్యాంకు సాధించాడు. గత నెల 5వ తేదీన నీట్‌ యూజీ జరిగింది. ఫలితాలను జాతీయ పరీక్షల సంస్థ(ఎన్‌టీఏ) మంగళవారం వెల్లడించింది. 

67 మందికి సమాన పర్సంటైల్‌

దేశవ్యాప్తంగా ఈసారి 23.33 లక్షల మంది పరీక్ష రాశారు. వారిలో 13.16 లక్షల మంది ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 67 మందికి సమాన పర్సంటైల్‌(99.997129) దక్కడంతో వారందరికీ ఒకటో ర్యాంకు కేటాయించారు. వారిలో 14 మంది అమ్మాయిలు, 53 మంది అబ్బాయిలు. ఒకటో ర్యాంకు సాధించిన వారిలో నలుగురు ఏపీ విద్యార్థులున్నారు. రాజస్థాన్‌ నుంచి అత్యధికంగా 11 మంది విద్యార్థులున్నారు.

జనరల్‌కు కటాఫ్‌ మార్కులు 164

పరీక్ష 720 మార్కులకు నిర్వహించగా జనరల్‌ విభాగం విద్యార్థులకు కటాఫ్‌ మార్కులను 164గా నిర్ణయించారు. అంటే 164 మార్కులు వస్తేనే ఎంబీబీఎస్, ఇతర కోర్సుల్లో చేరడానికి అర్హత పొందుతారు. ఇక బీసీ, ఎస్‌సీ, ఎస్‌టీలకు 129, ఈడబ్ల్యూఎస్‌కు 146 మార్కులు తప్పనిసరి.

ఎస్‌టీ కేటగిరీలో టాప్‌ ర్యాంకు 167

ఎన్‌టీఏ కేటగిరీల వారీగా టాప్‌ 10 ర్యాంకులను ప్రకటించింది. ఎస్‌టీ కేటగిరీలో తెలంగాణకు చెందిన గుగులోతు వెంకట నృపేష్‌ 167వ ర్యాంకు, లావుడ్య శ్రీరామ్‌ నాయక్‌ 453వ ర్యాంకు సాధించి దేశవ్యాప్తంగా తొలి రెండు స్థానాలు సాధించిన వారి జాబితాలో నిలిచారు.

అభ్యర్థులు పెరిగారు...  ఉత్తీర్ణతా పెరిగింది

గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి రాష్ట్రం నుంచి పోటీపడిన అభ్యర్థుల సంఖ్య పెరగగా, ఉత్తీర్ణత శాతమూ పెరగడం విశేషం. పోయిన సంవత్సరం 72,842 మంది పరీక్ష రాయగా 42,654 మంది(58.55 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ఈసారి 77,849 మంది పరీక్ష రాయగా..47,371 మంది(60.84 శాతం) ఉత్తీర్ణులయ్యారు. జాతీయ సగటు ఉత్తీర్ణత 56.41 శాతం ఉంది. అంటే  రాష్ట్ర విద్యార్థులు దాదాపు నాలుగున్నర శాతం అధికంగా పాసయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని