Andhra News: ఏపీ నిఘా విభాగాధిపతిగా మహేష్‌చంద్ర లడ్హా

రాష్ట్ర నిఘా విభాగాధిపతిగా మహేష్‌చంద్ర లడ్హాను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. 1998 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి అయిన లడ్హా కేంద్ర సర్వీసుల్లో డిప్యుటేషన్‌ ముగించుకుని మంగళవారం ఏపీ ప్రభుత్వానికి రిపోర్ట్‌ చేశారు.

Published : 03 Jul 2024 04:03 IST

ఈనాడు, అమరావతి: రాష్ట్ర నిఘా విభాగాధిపతిగా మహేష్‌చంద్ర లడ్హాను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. 1998 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి అయిన లడ్హా కేంద్ర సర్వీసుల్లో డిప్యుటేషన్‌ ముగించుకుని మంగళవారం ఏపీ ప్రభుత్వానికి రిపోర్ట్‌ చేశారు. వెంటనే ఆయన్ను నిఘా విభాగాధిపతిగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌ కుమార్‌ ప్రసాద్‌ ఉత్తర్వులు జారీ చేశారు. లడ్హా గతంలో ప్రకాశం, నిజామాబాద్, గుంటూరు జిల్లాల్లో ఎస్పీగా పని చేశారు. హైదరాబాద్‌ ఈస్ట్‌ జోన్‌ డీసీపీగా, జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్‌ఐఏలో దాదాపు ఐదేళ్లపాటు ఎస్పీగా, డీఐజీగా విధులు నిర్వర్తించారు. విజయవాడ నగర జాయింట్‌ పోలీస్‌ కమిషనర్‌గా, విశాఖ నగర పోలీస్‌ కమిషనర్‌గా, నిఘా విభాగంలో ఐజీగానూ పని చేశారు. 2019- 20 మధ్య ఏపీ పోలీస్‌ పర్సనల్‌ విభాగం ఐజీగా పని చేసి కేంద్ర సర్వీసులకు డిప్యుటేషన్‌పై వెళ్లారు. అక్కడ సీఆర్‌పీఎఫ్‌లో ఐజీగా నాలుగేళ్లపాటు పని చేసి, ఇప్పుడు ఏపీకి తిరిగొచ్చారు.

మావోయిస్టుల దాడి నుంచి బయటపడి..

మహేశ్‌ చంద్ర లడ్హా ప్రకాశం జిల్లా ఎస్పీగా పని చేసిన సమయంలో ఆయన ప్రయాణిస్తున్న వాహనాన్ని మావోయిస్టులు క్లెమోర్‌మైన్స్‌తో పేల్చేశారు. అది బుల్లెట్‌ప్రూఫ్‌ వాహనం కావడంతో లడ్హా, ఆయన ఇద్దరు గన్‌మన్లు, డ్రైవర్‌ ప్రాణాలతో బయటపడ్డారు. ఈ దుర్ఘటనలో ఇద్దరు పౌరులు మృతి చెందారు. మరో నలుగురు గాయపడ్డారు. అప్పట్లో ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని