అప్పుల కుప్పగా విద్యుత్‌ సంస్థ

జగన్‌ అప్పుల థియరీ ఇంధన శాఖను నిండా ముంచింది. గత వైకాపా ప్రభుత్వం ఐదేళ్లలో ఎన్నడూ లేనంతగా సంస్థ అప్పులను రూ. 1.20 లక్షల కోట్లకు పెంచింది.

Published : 02 Jul 2024 04:38 IST

ఎన్నడూ లేనంతగా రూ. 1.20 లక్షల కోట్లకు చేరిన రుణభారం 
ఈ పరిస్థితికి దారితీసిన కారణాలపై చర్చించిన సీఎం చంద్రబాబు
గత వైకాపా ప్రభుత్వ అసంబద్ధ నిర్ణయాలే కారణమన్న అధికారులు

ఈనాడు, అమరావతి: జగన్‌ అప్పుల థియరీ ఇంధన శాఖను నిండా ముంచింది. గత వైకాపా ప్రభుత్వం ఐదేళ్లలో ఎన్నడూ లేనంతగా సంస్థ అప్పులను రూ. 1.20 లక్షల కోట్లకు పెంచింది. ఈ పరిస్థితి నెలకొనడానికి దారితీసిన కారణాలపై సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో ట్రాన్స్‌కో, జెన్‌కో, డిస్కంల ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం సమీక్షించారు. గత ప్రభుత్వం స్వల్పకాలిక ఒప్పందాల ద్వారా ఐదేళ్ల వ్యవధిలో బహిరంగ మార్కెట్‌లో కొనుగోలు చేసిన విద్యుత్‌ ఎంత? ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? సంస్థపై అప్పుల భారం పెరగడానికి కారణాలేంటి తదితర అంశాలపై సీఎం అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇంధన శాఖపై ఈ నెల 8న శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ప్రధానంగా సంస్థ ఆర్థిక అంశాలపై సమీక్షించారు.

ప్రజలపై రూ.18 వేల కోట్ల భారం వేసినా..

గత వైకాపా సర్కారు విద్యుత్‌ సంస్థ నిర్వహణ కోసం రూ. 53,560 కోట్లు అప్పులు చేసింది. అంతకుముందు శ్లాబ్‌ల మార్పు.. టారీఫ్‌ల సవరణ.. ట్రూఅప్‌ పేరిట ప్రజలపై సుమారు రూ. 18,817 కోట్ల ఛార్జీల భారాన్ని మోపింది. ఆ తర్వాత కూడా నిర్వహణ కోసం ఇంత పెద్ద మొత్తంలో అప్పులు ఎందుకు చేయాల్సి వచ్చిందని సీఎం అధికారులను ప్రశ్నించినట్లు సమాచారం. సంక్షేమ పథకాల అమలులో భాగంగా వివిధ వర్గాలకు ఉచితంగా అందించిన విద్యుత్‌కు సంబంధించిన రాయితీ రూ. 15,036 కోట్లు చెల్లించకపోగా.. ప్రభుత్వ శాఖలు రూ. 15,795 కోట్ల మొత్తం విద్యుత్‌ బిల్లుల్ని పెండింగ్‌లో పెట్టాయని అధికారులు వివరించారు. వాటితో పాటు ఏపీ పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌కు రూ.2,000 కోట్లు అప్పుగా ఇచ్చామని.. గత ప్రభుత్వానికి విద్యుత్‌ సుంకం కింద రూ.3,100 కోట్లు ముందస్తుగా చెల్లించినట్లు తెలిపారు. ఈ మొత్తాన్ని సర్దుబాటు చేయడానికి అప్పులు తీసుకోక తప్పలేదని అధికారులు తెలిపినట్లు సమాచారం. 2022-23, 2023-24 సంవత్సరాలకు సంబంధించి రూ. 17,137 కోట్ల ట్రూఅప్‌ ప్రతిపాదనలు ఉన్నాయని, అవి వసూలు కావాల్సి ఉందని సీఎంకు తెలిపినట్లు తెలిసింది. తీసుకున్న రుణాలపై వడ్డీ రూపేణా ఏటా సుమారు రూ. 6,000 కోట్లు చెల్లించాల్సి వస్తోందని వెల్లడించారు. 

థర్మల్‌ ప్లాంట్ల నిర్మాణాన్ని నిలిపివేయడంతో..

కృష్ణపట్నం, వీటీపీఎస్‌లో థర్మల్‌ ప్లాంట్ల నిర్మాణాన్ని గత ప్రభుత్వం జాప్యం చేసిన కారణంగా ప్రజలపై సుమారు రూ.15 వేల కోట్ల విద్యుత్‌ ఛార్జీల భారం వేయాల్సి వచ్చిందని అధికారులు సీఎం చంద్రబాబుకు వివరించినట్లు తెలిసింది. 2019 నాటికి సుమారు 80 శాతం పనులు పూర్తయ్యాయయని, గత ప్రభుత్వం వాటిని పట్టించుకోలేదని తెలిపారు. దీంతోపాటు థర్మల్‌ యూనిట్లను ఉత్పత్తిలోకి తేవడంలో రెండేళ్ల జాప్యం వల్ల ఇంట్రస్ట్‌ డ్యూరింగ్‌ కన్‌స్ట్రక్షన్‌ (ఐడీసీ) కింద 10 వేల కోట్ల భారం ప్రజలపై పడనుందని పేర్కొన్నారు. సంస్థ ఆర్థిక అంశాలకు సంబంధించి మరికొన్ని విషయాలను కూడా వివరించినట్లు తెలిసింది. ఈ నెల 4న సీఎం దిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. అక్కడి నుంచి తిరిగి వచ్చిన తర్వాత విద్యుత్‌ శాఖపై మరోసారి సమీక్షించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని