వైకాపా జేబు సంస్థగా ఏపీ ఫైబర్‌నెట్‌!

ఏపీ ఫైబర్‌నెట్‌ను తన వారికి ఉపాధి కేంద్రంగా మాజీ సీఎం బంధువు.. ఎంపీ అవినాష్‌రెడ్డి మార్చేశారు. అవసరం లేకున్నా వందల మందికి ఉద్యోగాలు ఇవ్వాలంటూ సిఫార్సు లేఖలు ఇచ్చారు.

Updated : 01 Jul 2024 06:45 IST

ఎంపీ అవినాష్‌రెడ్డి సిఫార్సుతో ఉద్యోగాలు 
ఎన్నికల ముందు రూ.1,250 కోట్ల అప్పులు 
గుత్తేదారుకు ఏటా రూ.10 కోట్ల చెల్లింపులు 
అక్రమాలపై విచారణకు త్వరలో కమిటీ?

ఈనాడు, అమరావతి: ఏపీ ఫైబర్‌నెట్‌ను తన వారికి ఉపాధి కేంద్రంగా మాజీ సీఎం బంధువు.. ఎంపీ అవినాష్‌రెడ్డి మార్చేశారు. అవసరం లేకున్నా వందల మందికి ఉద్యోగాలు ఇవ్వాలంటూ సిఫార్సు లేఖలు ఇచ్చారు. ఆ లేఖ తీసుకు రావడమే ఆలస్యమన్నట్లు.. సంస్థ అప్పటి ఎండీ మధుసూదన్‌రెడ్డి వారికి పోస్టింగులు ఇచ్చారు. ఫైబర్‌నెట్‌ను సొంత జేబు సంస్థలా వైకాపా మార్చుకుందనడానికి ఇదే నిదర్శనం. అవసరం లేకపోయినా సిబ్బందిని నియమించడం వల్ల  ఆర్థికంగా భారం పెరిగి సంస్థ మరింతగా నష్టాల్లో కూరుకుపోయింది. దీంతోపాటు ఐదేళ్ల వ్యవధిలో సంస్థ పేరిట రూ.1,250 కోట్ల అప్పులను గత ప్రభుత్వం తీసుకుంది. ఆ మొత్తాన్ని సంస్థ అభివృద్ధి కోసం కాకుండా.. పర్సంటేజీలు తీసుకుని గుత్తేదారులకు బిల్లులు చెల్లించడానికి వాడేసింది. ఈ తరహాలో జగన్‌ జమానాలో ఫైబర్‌నెట్‌లో జరిగిన  అక్రమాలపై విచారణ జరిపేందుకు కమిటీని ఏర్పాటు చేయాలని తాజాగా కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. సంస్థలో జరిగిన అక్రమాలను కప్పిపుచ్చేందుకు ఆధారాలను ధ్వంసం చేసేందుకు కొందరు సిబ్బంది ఇప్పటికే ప్రయత్నించిన విషయం తెలిసిందే. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజే సంస్థ కార్యాలయాన్ని ప్రభుత్వం సీజ్‌ చేసింది. కేబుల్‌ వినియోగదారులకు ఇబ్బంది లేకుండా సేవలను కొనసాగించేలా ఆపరేటర్లతో అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. వారికి ఎలాంటి సమస్య ఉన్నా మెయిల్‌ ద్వారా సమాచారం అందిస్తే.. అందుకు అనుగుణంగా తగిన చర్యలను తీసుకుంటున్నామని ఒక ఉన్నతాధికారి తెలిపారు. 

రూ.1,250 కోట్లు ఏమయ్యాయి?

ఆఖరి ఏడాదిలో ఫైబర్‌నెట్‌ సంస్థ ఆదాయాన్ని హామీగా చూపి గత ప్రభుత్వం రెండు దఫాలుగా రూ.1,250 కోట్లు అప్పు తెచ్చింది. ఈ మొత్తాన్ని సంస్థ అభివృద్ధికి ఖర్చు చేయలేదు. ఇందులో రూ.950 కోట్లు భారీగా కమీషన్‌ తీసుకుని సీసీ కెమెరాలను పర్యవేక్షించే గుత్తేదారుకు జగన్‌ ప్రభుత్వం చెల్లించింది. ఈ వ్యవహారంలో పర్సంటేజీల రూపంలో సుమారు రూ.150 కోట్లు చేతులు మారినట్లు సమాచారం. ఐదేళ్ల పాటు వారికి బిల్లులు చెల్లించకుండా ఎన్నికలకు ముందు హడావుడిగా అప్పు తెచ్చి చెల్లించాల్సిన అవసరం ఏమిటనే ప్రశ్న వినిపిస్తోంది. 

ఎండీగా ముగ్గురి పేర్ల పరిశీలన

సంస్థ పాలనా వ్యవహారాల కోసం పూర్తి స్థాయిలో ఎండీని నియమించాలని ప్రస్తుత ప్రభుత్వానికి ఉన్నతాధికారులు ప్రతిపాదించారు. ఈ మేరకు కొద్ది రోజుల్లోనే ఫైబర్‌నెట్‌కు ఎండీని ప్రభుత్వం నియమించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. దీనికోసం ముగ్గురు అధికారుల పేర్లు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. గత ఎండీ మధుసూదన్‌రెడ్డిని ప్రభుత్వం సాధారణ పరిపాలన శాఖకు పంపింది. ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు ఆయన ప్రయత్నించారు. ప్రభుత్వం ఆయన్ను రిలీవ్‌ చేయలేదు. కొత్త ఎండీ బాధ్యతలు చేపట్టిన తర్వాత సంస్థలో జరిగిన అక్రమాలపై విచారణ ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. 


పనిచేసేది ఎందరు.. బినామీలు ఎంత మంది? 

వసరం లేకున్నా అడ్డగోలుగా వందల సంఖ్యలో సిబ్బందిని నియమించడంతో సంస్థపై జీతాల భారం మూడు రెట్లు పెరిగింది. 2019లో నెలకు రూ.59 లక్షల చొప్పున జీతాల కింద చెల్లిస్తే..అది 2024 నాటికి సుమారు రూ.2 కోట్లకు చేరింది. మరోవైపు సంస్థకు ఆదాయాన్ని పెంచేందుకు కొత్త కనెక్షన్లను కూడా పెంచలేదు. దీంతో సంస్థ నష్టాలు నెలకు రూ.5 కోట్లకు మించింది. ఇందులో జీతాల రూపంలో సంస్థపై పడిన అదనపు భారం రూ.1.4 కోట్లు. విజయవాడలోని సంస్థ కేంద్ర కార్యాలయం, వివిధ జిల్లాల్లో పనిచేసే సిబ్బంది సంఖ్య సుమారు 1,429గా ఉంటుందని భావిస్తున్నారు. దీంతో ఎవరెవరు ఎక్కడ పనిచేస్తున్నారు? వారి సేవలు సంస్థకు అవసరమేనా? బినామీ పేర్లతో జీతాలు తీసుకుంటున్నారా అన్న వివరాలను అధికారులు బయటకు తీస్తున్నారు. ఈ దృష్ట్యా సంస్థ కేంద్ర కార్యాలయాన్ని సీజ్‌ చేసినా.. ఆన్‌లైన్‌లో రోజువారీ హాజరు తీసుకుంటున్నారు. 

సంస్థలో వందల సంఖ్యలో సిబ్బందిని నియమించిన తర్వాత కూడా నిర్వహణ బాధ్యతలను గుత్తేదారు సంస్థకు అప్పగించారు. ఆ సంస్థకు ఏటా రూ.10 కోట్లకు పైగా గత ప్రభుత్వం చెల్లించింది. ఆ టెండరు కూడా వైకాపా నాయకుడికే కట్టబెట్టినట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో నిర్వహణ పనులు మొత్తం సంస్థ సిబ్బంది ద్వారా చేయిస్తూ.. గుత్తేదారు సంస్థకు లబ్ధి చేకూర్చేలా వ్యవహరించినట్లు తెలిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని