వైకాపా భవనాలకు అనుమతుల్లేవు

వివిధ జిల్లాల్లోని వైకాపా కార్యాలయ భవనాల నిర్మాణాలకు అనుమతులు తీసుకోలేదని, నిబంధనలకు విరుద్ధంగా వాటిని నిర్మించారని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్‌ హైకోర్టులో వాదనలు వినిపించారు.

Published : 28 Jun 2024 05:39 IST

సామాన్యులకు వర్తించే నిబంధనలే  పార్టీలకూ వర్తిస్తాయి
రాజకీయ పార్టీ పేరుతో  కోర్టు నుంచి రక్షణ పొందలేరు
హైకోర్టులో ఏజీ  దమ్మాలపాటి శ్రీనివాస్‌ వాదనలు
తీర్పు రిజర్వు చేసిన న్యాయస్థానం

ఈనాడు, అమరావతి: వివిధ జిల్లాల్లోని వైకాపా కార్యాలయ భవనాల నిర్మాణాలకు అనుమతులు తీసుకోలేదని, నిబంధనలకు విరుద్ధంగా వాటిని నిర్మించారని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్‌ హైకోర్టులో వాదనలు వినిపించారు. నిబంధనలను ఉల్లంఘిస్తూ కార్యాలయ భవనాలను నిర్మించుకునేందుకు రాజకీయ పార్టీలకు ప్రత్యేక వెసులుబాటు ఉండదన్నారు. రాజకీయ పార్టీ అనే కారణం చూపుతూ న్యాయస్థానం నుంచి రక్షణ పొందలేరన్నారు. సామాన్య ప్రజలకు వర్తించే నిబంధనలే పార్టీలకూ వర్తిస్తాయన్నారు. నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన నిర్మాణాలపై వివరణ ఇవ్వాలని అధికారులు ప్రస్తుతం ప్రాథమిక ఉత్తర్వులు మాత్రమే జారీచేశారన్నారు. సమాధానం ఇస్తే వాటిని పరిశీలించి తుది ఉత్తర్వులు జారీ చేస్తారన్నారు. తుది ఉత్తర్వులపై అభ్యంతరం ఉంటే అప్పుడు కోర్టును ఆశ్రయించాలన్నారు. అపరిపక్వ దశలో వ్యాజ్యాలు దాఖలు చేశారని.. వాటికి విచారణ అర్హత లేదని తెలిపారు. భవనాలు కూల్చివేస్తే నష్టం జరుగుతుందని, బాధితులుగా మారతామనే కారణాన్ని సాకుగా చూపుతూ న్యాయస్థానం నుంచి సానుకూల ఉత్తర్వులు పొందాలని పిటిషనర్లు చూస్తున్నారన్నారు. ఇలాంటి వైఖరిని ప్రోత్సహించడానికి వీల్లేదని చెప్పారు. అధికారులు ఇచ్చిన నోటీసులకు వివరణ ఇస్తే వాటిపై తగిన నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు. ఈ దశలో మధ్యంతర ఉత్తర్వులు జారీచేయవద్దని కోరారు. అనుబంధ పిటిషన్లను కొట్టేయాలని కోరారు. గురువారం జరిగిన విచారణలో ఇరువైపు న్యాయవాదుల వాదనలు ముగియడంతో అనుబంధ పిటిషన్లపై మధ్యంతర ఉత్తర్వులిచ్చే వ్యవహారంపై తీర్పును రిజర్వ్‌ చేస్తున్నట్లు న్యాయమూర్తి జస్టిస్‌ బి కృష్ణమోహన్‌ ప్రకటించారు. కూల్చివేతల విషయంలో యథాతథ స్థితి పాటించాలంటూ బుధవారం ఇచ్చిన ఉత్తర్వులు ఈ అనుబంధ పిటిషన్లపై నిర్ణయం వెల్లడించేంత వరకు పొడిగిస్తున్నట్లు పేర్కొన్నారు. 

అనుమతి పొందకుండా నిర్మిస్తున్న వైకాపా  కార్యాలయ భవనాలను ఎందుకు కూల్చకూడదో వివరణ ఇవ్వాలని కోరుతూ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా నోటీసులు జారీచేశారు. వీటిని సవాలు చేస్తూ వివిధ జిల్లాల వైకాపా అధ్యక్షులు బుధవారం హైకోర్టులో వ్యాజ్యాలు దాఖలు చేశారు. గురువారం మరికొన్ని జిల్లాల అధ్యక్షులు వ్యాజ్యాలు వేశారు. వీటన్నింటిపై హైకోర్టు విచారణ జరిపింది. 

కూల్చడమే పరిష్కారం కాదు: పిటిషనర్ల తరఫు న్యాయవాదులు 

పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాదులు పి.వీరారెడ్డి, సీవీ మోహన్‌రెడ్డి మరికొంతమంది న్యాయవాదులు వాదనలు వినిపించారు. బిల్డింగ్‌ ప్లాన్‌ ఆమోదం కోసం చేసిన దరఖాస్తులు అధికారుల వద్ద పెండింగ్‌లో ఉన్నాయన్నారు. నిర్దిష్ట సమయంలో వాటిపై అధికారులు నిర్ణయం తీసుకోకపోతే.. అనుమతి ఇచ్చినట్లు భావించి నిర్మాణాలను కొనసాగించవచ్చని వాదించారు. ఈ నేపథ్యంలోనే నిర్మాణాలు జరిపామన్నారు. నిబంధనలు ఉల్లంఘించినప్పుడు భవనాలను కూల్చివేయడమే పరిష్కారం కాదన్నారు. వాటిని క్రమబద్ధీకరించవచ్చని వివరించారు. ప్రభుత్వ పెద్దల సూచనలతో అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారని ఆరోపించారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకొని పార్టీ కార్యాలయాల భవనాలు కూల్చివేతల విషయంలో యథాతథ స్థితిని పాటించేలా అధికారులను ఆదేశించాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని