New Criminal Laws: ఏ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయాల్సిందే

భారత న్యాయవ్యవస్థలో నూతన అధ్యాయానికి తెరలేచింది.  దేశంలో బ్రిటిష్‌ వలస పాలన నుంచి కొనసాగుతున్న భారత శిక్షా స్మృతి (ఐపీసీ), నేర శిక్షాస్మృతి (సీఆర్‌పీసీ), భారత సాక్ష్యాధార చట్టం కనుమరుగు కానున్నాయి.

Updated : 01 Jul 2024 07:02 IST

నేరం జరిగిన ప్రాంతం తమ పరిధిలోకి రాదంటూ నిరాకరించే వీల్లేదు
అత్యవసర పరిస్థితుల్లో ఉన్న బాధితుల నుంచి ఫిర్యాదు అందితే ‘జీరో ఎఫ్‌ఐఆర్‌’ కట్టాల్సిందే
జులై 1 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త చట్టాలతో వెసులుబాటు
ఇకపై ఐపీసీకి బదులు బీఎన్‌ఎస్‌ సెక్షన్ల కిందే కేసుల నమోదు

భారత న్యాయవ్యవస్థలో నూతన అధ్యాయానికి తెరలేచింది.  దేశంలో బ్రిటిష్‌ వలస పాలన నుంచి కొనసాగుతున్న భారత శిక్షా స్మృతి (ఐపీసీ), నేర శిక్షాస్మృతి (సీఆర్‌పీసీ), భారత సాక్ష్యాధార చట్టం కనుమరుగు కానున్నాయి. వాటి స్థానంలో గతేడాది పార్లమెంటు ఆమోదించిన భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్‌), భారతీయ నాగరిక్‌ సురక్షా సంహిత (బీఎన్‌ఎస్‌ఎస్‌), భారతీయ సాక్ష్య అధినియమ్‌ (బీఎస్‌ఏ) ఆదివారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి.

ఈనాడు-అమరావతి: నేరాల బారిన పడ్డ బాధితులు ఇకపై ఏ పోలీసుస్టేషన్‌ పరిధిలోనైనా ఫిర్యాదు చేయవచ్చు. నేరం జరిగిన ప్రాంతం తమ పరిధిలోకి రాదంటూ ఎఫ్‌ఐఆర్‌ నమోదుకు పోలీసుస్టేషన్‌ సిబ్బంది నిరాకరించేందుకు వీల్లేదు. అత్యవసర, విపత్కర పరిస్థితుల్లో ఉన్న బాధితుల నుంచి ఫిర్యాదు అందితే ‘జీరో ఎఫ్‌ఐఆర్‌’ నమోదు చేయాల్సిందే. సత్వరమే స్పందించి తగిన చర్యలు చేపట్టాల్సిందే. ఆ తర్వాతే ఆ నేరం ఏ పోలీసుస్టేషన్‌ పరిధిలో జరిగిందో చూసి అక్కడికి బదిలీ చేయాలి. అలాగే బాధితులు నేరుగా పోలీసుస్టేషన్‌కు వెళ్లకుండానే పోలీసు అధికారిక వెబ్‌సైట్, యాప్‌ సహా ఇతర ఎలక్ట్రానిక్‌ కమ్యూనికేషన్‌ పద్ధతుల్లో ఫిర్యాదులు చేయవచ్చు. వాటిపై మూడు రోజుల్లోగా ఫిర్యాదుదారు సంతకం తీసుకుని ప్రాథమిక విచారణ జరిపి కేసు నమోదు చేయాలి. ఇప్పటివరకూ అమల్లో ఉన్న క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ లో(సీఆర్‌పీసీ) ఈ ప్రొవిజన్లు లేవు. కేవలం కేంద్ర హోంశాఖ మార్గదర్శకాల మేరకు జీరో ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా సోమవారం నుంచి అమల్లోకి రానున్న కొత్త నేర న్యాయ చట్టాల్లో ఈ మేరకు ‘జీరో ఎఫ్‌ఐఆర్‌’, ‘ఈ-ఎఫ్‌ఐఆర్‌’కు చోటు కల్పించారు. ఏడేళ్లు అంతకంటే ఎక్కువ శిక్ష పడే అవకాశమున్న నేరాలకు సంబంధించి దర్యాప్తు అధికారులు నేర ఘటనా స్థలానికి ఫోరెన్సిక్‌ నిపుణులను తప్పనిసరిగా తీసుకెళ్లి వారి ద్వారా ఆధారాలు సేకరించాలి. నేర ఘటనా స్థలం, అక్కడున్న పరిస్థితులు, ఆధారాలన్నింటినీ ఆడియో, వీడియో రికార్డింగ్‌ చేయాలి. దీని కోసం ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి పోలీసుస్టేషన్‌కు ట్యాబ్‌లు అందజేశారు. వాటిల్లో రికార్డు చేస్తే అవి నేరుగా ఈ-సాక్ష్య డిజీలాకర్‌లోకి వెళ్తాయి. పోలీసులు, న్యాయవాదులు, న్యాయమూర్తులు వాటిని పరిశీలించుకోవచ్చు. ఆధారాలు మాయం చేయడం వీలుకాదు. 

ఆదివారం అర్ధరాత్రి తర్వాత జరిగిన నేరాలపై కొత్త సెక్షన్లే

కొత్త చట్టాలు అమల్లోకి రావడంతో ఆదివారం అర్ధరాత్రి 12 తర్వాత ఏ నేరం జరిగినా ఐపీసీ సెక్షన్లకు బదులుగా బీఎన్‌ఎస్‌ చట్టంలోని సెక్షన్ల కిందే కేసు నమోదు చేయనున్నారు. ఆ మేరకు ఆంధ్రప్రదేశ్‌ పోలీసు శాఖ ఇప్పటికే అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసింది. సీసీటీఎన్‌ఎస్‌ (క్రైమ్‌ అండ్‌ క్రిమినల్‌ ట్రాకింగ్‌ నెట్‌వర్క్‌ అండ్‌ సిస్టమ్స్‌)లో కూడా ఆ మేరకు మార్పులు చేసింది. ఈ కొత్త చట్టాల్లోని సెక్షన్లు, వాటి అమలులో అనుసరించాల్సిన ప్రామాణిక నిర్వహణ పద్ధతులు, ఇతర అంశాలపై క్షేత్రస్థాయి సిబ్బందికి ఇప్పటికే పలు విడతల్లో శిక్షణ అందించామని డీజీపీ సీహెచ్‌.ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఎస్‌హెచ్‌వోలు, దర్యాప్తు అధికారులకు వచ్చే సందేహాలను నివృత్తి చేసేందుకు జిల్లా, సబ్‌డివిజన్ల స్థాయిలో నిపుణులతో ప్రత్యేక హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీసుస్టేషన్లలో ఈ కొత్త చట్టాల అమలుపై సోమవారం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామని వివరించారు. 

వివరాలు నమోదుకు ప్రతి జిల్లాకు ఒక పోలీసు అధికారి..

సెక్షన్‌ 37 ప్రకారం అరెస్టయినవారి పేర్లు, వారి చిరునామాలు, ఏ నేరాభియోగంపై వారు అరెస్టయ్యారనే సమాచారం, ఆ రికార్డుల నిర్వహణ కోసం ప్రతి జిల్లాకు ఒక పోలీసు అధికారిని, ప్రతి పోలీసుస్టేషన్‌లో ఏఎస్సై హోదా కంటే తక్కువ కాని అధికారిని నియమించారు. రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో పోలీసు కంట్రోల్‌ రూమ్‌లను నోటిఫై చేశారు. దృశ్యమాధ్యమ విధానం ద్వారా సాక్షులను విచారించేందుకు వీలుగా జిల్లా, మండల స్థాయిలో హైకోర్టు అనుమతితో నిర్దేశిత ప్రాంతాల్లో ఏర్పాటైన వీడియో కాన్ఫరెన్స్‌ గదులను నోటిఫై చేశారు. నగర పోలీసు కమిషనర్లు, జిల్లా ఎస్పీలను ప్రత్యేక ఎగ్జిక్యూటివ్‌ మెజిస్ట్రేట్లుగా గుర్తించారు. ఆంధ్రప్రదేశ్‌లోని పోలీసు అధికారులు, సిబ్బందికి బీఎన్‌ఎస్‌ఎస్‌ చట్టాల్లోని అంశాల ప్రకారం అధికారాలు ఇచ్చారు. ఇప్పటికే వీటన్నింటికీ సంబంధించి నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. ఇవన్నీ ఆదివారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి.


మహిళలు, చిన్నారులపై జరిగే నేరాల దర్యాప్తు రెండు నెలల్లోనే పూర్తిచేయాలి

  • మహిళలు, చిన్నారులపై జరిగే నేరాల దర్యాప్తు రెండు నెలల్లోనే పూర్తికావాలి. బాధితుల వాంగ్మూలాలను మహిళా మెజిస్ట్రేట్‌ ఎదుట నమోదు చేయాలి. వారు అందుబాటులో లేకుంటే మహిళా సిబ్బంది సమక్షంలో పురుష మెజిస్ట్రేట్‌ ఎదుట హాజరుపరచొచ్చు. 
  • అత్యాచార కేసుల్లో బాధితురాలి వాంగ్మూలాన్ని ఆడియో, వీడియో ద్వారా నమోదు చేయాలి. 
  • 3-7 ఏళ్ల లోపు శిక్షపడే కేసుల్లో ఫిర్యాదు అందిన 24 గంటల్లోగా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలి. 14 రోజుల్లోగా దర్యాప్తు చేపట్టి కేసు కొలిక్కి తేవాలి. 
  • ఇప్పటివరకూ అమల్లో ఉన్న చట్టాల ప్రకారం నిందితుడు అరెస్టయిన తర్వాత 14 రోజల్లోపే పోలీసు కస్టడీకి కోరే అవకాశముంది. ఇప్పుడు ఈ గడువు పొడిగించారు. 
  • బాధితులు, నిందితులు ఎఫ్‌ఐఆర్‌ ప్రతులను ఉచితంగా పొందొచ్చు. పోలీసు రిపోర్టు, ఛార్జీషీటు, వాంగ్మూలాలు, ఇతర డాక్యుమెంట్లను రెండు వారాల్లోగా తీసుకోవచ్చు.
  • అరెస్టు సమాచారాన్ని నిందితుల స్నేహితులు, కుటుంబ సభ్యులు, బంధువులకు తప్పనిసరిగా పోలీసులు తెలియజేయాలి. అరెస్టు వివరాలు సంబంధిత పోలీసుస్టేషన్‌తో పాటు జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలోనూ బహిరంగంగా ప్రదర్శించాలి. 
  • దర్యాప్తు, న్యాయవిచారణ సమన్లు ఇకపై వాట్సప్‌ తదితర డిజిటల్‌ మార్గాల ద్వారా కూడా పంపించవచ్చు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని