Dr Prabhakar Reddy: వృత్తి వైద్యం.. ప్రవృత్తి జగన్‌ను కీర్తించడం..

ఆయనో ప్రభుత్వ ఉద్యోగి. అందులోనూ వైద్యవృత్తిలో ఉన్నారు. ఆ విషయాన్ని మరిచి వైకాపాతో మమేకమయ్యారు. నిత్యం జగన్‌ను కీర్తిస్తూ.. సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టడాన్ని, ఫార్వర్డ్‌ చేయడాన్ని ప్రవృత్తిగా చేసుకున్నారు.

Updated : 26 Jun 2024 17:16 IST

కర్నూలు జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ ప్రభాకర్‌రెడ్డి తీరిది
జూన్‌ 9న జగన్‌ ప్రమాణానికి విశాఖకు రావాలని వైద్యులకు చెప్పిన వైనం

ఈనాడు, అమరావతి, కర్నూలు: ఆయనో ప్రభుత్వ ఉద్యోగి. అందులోనూ వైద్యవృత్తిలో ఉన్నారు. ఆ విషయాన్ని మరిచి వైకాపాతో మమేకమయ్యారు. నిత్యం జగన్‌ను కీర్తిస్తూ.. సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టడాన్ని, ఫార్వర్డ్‌ చేయడాన్ని ప్రవృత్తిగా చేసుకున్నారు. ఫక్తు వైకాపా కార్యకర్తగా వ్యవహరించిన ఆయన పేరు డాక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి. తాను ప్రభుత్వ ఉద్యోగినన్న విషయాన్ని మర్చిపోయి వ్యవహరించిన ప్రభాకర్‌రెడ్డి ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టంపై అవాకులు.. చవాకులు పేలుతున్నారని కూడా విమర్శించారు. ఇలాంటి ఈయనకు నాటి ప్రభుత్వం కర్నూలు జీజీహెచ్‌ ఇన్‌ఛార్జి సూపరింటెండెంట్‌గా పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగించింది. అయినా వందల మంది వైద్యులు, సిబ్బందికి దిశానిర్దేశం చేయాల్సిన ఈయన్ను కట్టడి చేసే చర్యలకు ప్రయత్నమేమీ చేయలేదు. కర్నూలు జీజీహెచ్‌లో కార్డియోథొరాసిక్‌ విభాగాధిపతిగా ఉంటూ పైరవీలతో ఇన్‌ఛార్జి సూపరింటెండెంట్‌ పోస్టులోకి వచ్చిన ప్రభాకర్‌రెడ్డి ఎన్నికలకు ముందు వరకు సాగించిన ప్రచారాన్ని ఉద్యోగులు ప్రస్తుతం గుర్తుచేస్తున్నారు. ఆయన భావజాలం పూర్తిగా వైకాపాతో ఉన్నందున.. ఇప్పుడు ఆయనతో కలిసి ఎలా పనిచేయగలమని వైద్యులు, సిబ్బంది ప్రశ్నిస్తున్నారు.

జగన్‌ దేవుడిగా కీర్తిస్తూ..

నాటి సీఎం జగన్‌ను పొగుడుతూ పాటలు, పద్యాలు, కవితలు, చిన్నపాటి కథలను సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేశారు. కార్టూన్లూ వేయించారు. జగన్‌ను దేవుడితో కూడా పోల్చారు. వీటికి వైద్య కళాశాల, సర్వజన ఆసుపత్రుల వాట్సప్‌ గ్రూపుల్లోనూ, ఫేస్‌బుక్‌లోనూ, ఇతర సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం కల్పించారు. ఈయన స్వామిభక్తికి వైకాపా ప్రభుత్వం మెచ్చి... సీనియర్లను కాదని నాటి మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి సిఫార్సుతో ఇన్‌ఛార్జి సూపరింటెండెంట్‌గా బాధ్యతలు చేపట్టారు. పేరుకు ఇన్‌ఛార్జి అని పేర్కొన్నా.. ఆసుపత్రి పూర్తిగా ఆయన కనుసన్నల్లోనే నడుస్తోంది. వాస్తవానికి.. అదనపు డీఎంఈ హోదా ఉన్న వైద్యులనే సూపరింటెండెంట్‌గా నియమించాలన్న నిబంధన ఉన్నా అమలు చేయలేదు. ఆయనకు ముందు సూపరింటెండెంట్లుగా నియమితులైన ఇద్దరూ వైకాపా నాయకుల అండదండలతోనే పదవులు దక్కించుకున్నారు. సూపరింటెండెంట్‌గా వచ్చిన తర్వాత కూడా. ‘విధులు నిర్వర్తించడానికి నేను సిద్ధం.. మీరు సిద్ధమా’ అంటూ ప్రభాకర్‌రెడ్డి పోస్టు పెట్టారు.

విశాఖకు వెళ్దాం.. సిద్ధంగా ఉండాలి

ఈ ఏడాది జూన్‌ 9న జగన్‌ సీఎంగా ప్రమాణం చేస్తారని, ఆ కార్యక్రమానికి విశాఖ రావాలని వైద్యులకు పిలుపునిచ్చారు. ఆయన తెదేపాకు వ్యతిరేకంగా విమర్శలు కూడా చేశారు. ‘మామా గాంధార సార్వభౌమ... ల్యాండ్‌టైట్లింగ్‌ యాక్ట్‌ గురించి ఎవరైనా తప్పుడు సమాచారం.. అవాకులు.. చవాకులు పేలితే.. వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చారట’ అని దివంగత ఎన్టీఆర్‌ బొమ్మతో పోస్ట్‌ పెట్టారు. జగనన్నే మన నమ్మకమని.. బతకాలిరా తమ్ముడు అని లోగో తయారుచేసి, అందులో ఫ్యాన్‌ గుర్తునూ ఉంచారు. జగనన్న చల్లని దీవెనలు పేదలందరికీ అందాలని, సీబీఎస్‌ఈ సిలబస్‌లో చదివించాలని, తల్లిదండ్రులు జగనన్నకు మంచిపేరు తేవాలనీ పేర్కొన్నారు. బెండపూడి విద్యార్థులు ఆంగ్లంలో మాట్లాడితే పులిసిపోతారు.. నాటునాటు పాట ఫంక్షన్లో హీరోలు అదే ఆంగ్లంలో మాట్లాడితే మా నాయనే.. మా బాబే అని మురిసి చంకలు గుద్దుకుంటారు. ఎంత కడుపు మంటారా పిల్లలపైన సామీ! అని కూడా ఓ పోస్టు పెట్టారు. ఎందుకిలా చేస్తున్నారు? వైద్యవృత్తిలో ఉన్నారు కదా అని ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై ఎదురుదాడికి దిగుతారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని