Andhra News: 1.81 లక్షల ఇంజినీరింగ్‌ సీట్లు

రాష్ట్రంలో ప్రైవేటు, ప్రభుత్వ ఇంజినీరింగ్‌ కళాశాలలు, డీమ్డ్‌ విశ్వవిద్యాలయాలు, రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక, సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ), కేంద్రీయ విశ్వవిద్యాలయంతో కలిపి 1,81,732 సీట్లకు అఖిలభారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) ఆమోదం తెలిపింది.

Updated : 04 Jul 2024 07:13 IST

ప్రభుత్వ కళాశాలల్లో 5,500.. ప్రైవేటులో 1.65 లక్షల సీట్లకు ఆమోదం
డీమ్డ్‌ వర్సిటీలు, ఆర్జీయూకేటీలలో మరికొన్ని
కొత్తగా రెండు విద్యాసంస్థలకు అనుమతి
మొత్తం సీట్లలో సాఫ్ట్‌వేర్‌ బ్రాంచిల్లోనే 80%

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో ప్రైవేటు, ప్రభుత్వ ఇంజినీరింగ్‌ కళాశాలలు, డీమ్డ్‌ విశ్వవిద్యాలయాలు, రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక, సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ), కేంద్రీయ విశ్వవిద్యాలయంతో కలిపి 1,81,732 సీట్లకు అఖిలభారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) ఆమోదం తెలిపింది. అమృత, గీతం, కేఎల్‌యూ, విజ్ఞాన్‌ డీమ్డ్‌ వర్సిటీల్లో 9,180 సీట్లకు ఆమోదం తెలిపింది. ఈ సీట్లను ఆయా విద్యాసంస్థలే నేరుగా భర్తీ చేసుకుంటాయి. ఆర్జీయూకేటీలో 1,440, కేంద్రీయ విశ్వవిద్యాలయంలో 33 సీట్లు సైతం కౌన్సెలింగ్‌కు పెట్టరు. ప్రభుత్వ కళాశాలల్లోని 5,500, ప్రైవేటు కళాశాలల్లో 1,65,579 సీట్లకు మాత్రమే ప్రభుత్వం కౌన్సెలింగ్‌ నిర్వహిస్తుంది. ప్రైవేటు కళాశాలల్లోని సీట్లలో 70% కన్వీనర్‌ కోటాలో భర్తీచేస్తారు. మిగతా 30% యాజమాన్య కోటాలో కేటాయిస్తారు. రాష్ట్రంలో కొత్తగా తిరుపతి, విశాఖపట్నంలో రెండు ఇంజినీరింగ్‌ కళాశాలలకు ఏఐసీటీఈ అనుమతి ఇచ్చింది. ఒక్కో కళాశాలలో 360 సీట్ల చొప్పున ఆమోదం తెలిపింది. గతేడాదితో పోలిస్తే ప్రభుత్వ ఇంజినీరింగ్‌ కళాశాలల్లో 520, ప్రైవేటు కళాశాలల్లో 27,879 సీట్లు పెరిగాయి. రాష్ట్రంలో గతేడాది ఆరు ప్రైవేటు విశ్వవిద్యాలయాలు ఉండగా.. ఈ విద్యా సంవత్సరంలో అన్నమయ్య జిల్లా రాజంపేటలోని అన్నమాచార్య, కాకినాడ జిల్లా సూరంపాలెంలోని ఆదిత్య, తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని గోదావరి గ్లోబల్‌ విద్యాసంస్థలకు గత ప్రభుత్వం ప్రైవేటు వర్సిటీలుగా గుర్తింపునిచ్చింది. ప్రైవేటు వర్సిటీల్లో 35% సీట్లను కన్వీనర్‌ కోటా ద్వారా భర్తీచేస్తారు. ఇలా 6వేల సీట్ల వరకు కౌన్సెలింగ్‌కు వచ్చే అవకాశం ఉంది. 

సీట్లన్నీ కంప్యూటర్‌ కోర్సుల్లోనే..

ఇంజినీరింగ్‌ సీట్లలో అత్యధికంగా కంప్యూటర్‌ సైన్సు, ఎమర్జింగ్‌ కోర్సుల్లోనే ఉన్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో మొత్తం 1,71,079 సీట్లు ఉంటే సీఎస్‌ఈ, ఏఐ, మెషీన్‌లెర్నింగ్, డేటా సైన్స్, ఐటీలాంటి కోర్సుల్లో 1,37,194 సీట్లు ఉన్నాయి. మొత్తం సీట్లలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలకు సంబంధించినవే 80% ఉన్నాయి. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ఐటీ బ్రాంచిలో ఈ ఏడాది 60 సీట్లు, శ్రీకృష్ణదేవరాయ వర్సిటీ ఇంజినీరింగ్‌ కళాశాలలో సీఎస్‌ఈ (ఏఐ, మెషీన్‌లెర్నింగ్, డేటా సైన్స్‌)లో 120 సీట్లు అదనంగా వచ్చాయి. జిల్లాలవారీగా చూస్తే ఉమ్మడి గుంటూరులో అత్యధికంగా 26,760 సీట్లు ఉండగా.. ఉమ్మడి కృష్ణాలో 20,595 సీట్లు ఉన్నాయి. అత్యల్పంగా ఉమ్మడి శ్రీకాకుళంలో 3,360 సీట్లు అందుబాటులో ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని