మీ కోసమే.. మేటి కొలువులు!

దేశంలో ఎక్కువమంది గ్రాడ్యుయేట్లు పోటీ పడే పరీక్ష ఎస్‌ఎస్‌సీ సీజీఎల్‌. వివిధ కేంద్ర విభాగాలు, వాటి అనుబంధ కార్యాలయాల్లో గ్రూప్‌-బి, గ్రూప్‌-సి ఖాళీల భర్తీకి స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) ఏటా కంబైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ లెవెల్‌ ఎగ్జామ్‌ (సీజీఎల్‌ఈ) నిర్వహిస్తోంది.

Published : 01 Jul 2024 00:02 IST

17,727 ఖాళీలు
సాధారణ డిగ్రీ చాలు
ఎస్‌ఎస్‌సీ సీజీఎల్‌ఈ ప్రకటన

దేశంలో ఎక్కువమంది గ్రాడ్యుయేట్లు పోటీ పడే పరీక్ష ఎస్‌ఎస్‌సీ సీజీఎల్‌. వివిధ కేంద్ర విభాగాలు, వాటి అనుబంధ కార్యాలయాల్లో గ్రూప్‌-బి, గ్రూప్‌-సి ఖాళీల భర్తీకి స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) ఏటా కంబైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ లెవెల్‌ ఎగ్జామ్‌ (సీజీఎల్‌ఈ) నిర్వహిస్తోంది. టైర్‌-1, టైర్‌-2 పరీక్షల ప్రతిభతో నియామకాలు చేపడతారు. ఎంపికైనవారికి హోదా, ఆకర్షణీయ వేతనం దక్కుతాయి. ఇటీవలే 17727 ఖాళీలతో సీజీఎల్‌ఈ - 2024 ప్రకటన వెలువడింది. ఏ బ్యాచిలర్‌ డిగ్రీ ఉన్నవారైనా ఈ పోస్టులకు పోటీపడొచ్చు. 

ప్రాధాన్యం ప్రకారం చూసుకుంటే- డిగ్రీ విద్యార్హతతో యూపీఎస్‌సీ నిర్వహించే పరీక్షల తర్వాత ఎస్‌ఎస్‌సీ సీజీఎల్‌ఈ ముఖ్యమైంది. కేంద్ర జనరల్‌ ఉద్యోగాల్లో సివిల్‌ సర్వీసెస్‌కు ఎంపికైన వారి తర్వాతి స్థాయి వీరిదే. అందువల్లే ఎక్కువమంది గ్రాడ్యుయేట్లు సీజీఎల్‌ఈకి పోటీ పడుతున్నారు. 

గత ఏడాది 7500 ఖాళీలకు 24.70 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు (వీరిలో సగం మందే పరీక్షకు హాజరయ్యారు) ఈ ఉద్యోగాలకు ఉన్న ప్రాధాన్యం అలాంటిది. ప్రకటనలో 17,727 ఖాళీలు ఉన్నప్పటికీ నియామకాల సమయానికి ఈ సంఖ్య పెరగవచ్చు. గత ఏడాదీ నోటిఫికేషన్‌ కంటే ఎక్కువ పోస్టులే భర్తీ చేశారు. విభాగాల వారీ పోస్టుల వివరాలను తర్వాత ప్రకటిస్తారు. వివిధ కేంద్ర విభాగాల్లో గ్రూప్‌-బీ, గ్రూప్‌-సీలో పలు హోదాలతో ఉద్యోగాలు ఉన్నాయి. ఎంపికైన పోస్టు ప్రకారం లెవెల్‌-4, లెవెల్‌-5, లెవెల్‌-6, లెవెల్‌-7 వేతనాలు వీరికి చెల్లిస్తారు. సుమారుగా.. లెవెల్‌-4తో రూ.45000, లెవెల్‌-5కి రూ.55000, లెవెల్‌-6 వాళ్లు రూ.65000, లెవెల్‌-7 అయితే రూ.80000 మొదటి నెల నుంచే జీతం అందుకోవచ్చు.

టైర్‌-1 ఇలా..

పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. 200 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. ప్రతి ప్రశ్నకు 2 మార్కుల చొప్పున వంద ప్రశ్నలుంటాయి. వీటిని గంటలో పూర్తి చేయాలి. ప్రతి తప్పు సమాధానానికీ అర మార్కు తగ్గిస్తారు. 

టైర్‌-2..

టైర్‌-1లో అర్హత సాధించినవారికే టైర్‌-2 ఉంటుంది. ఈ పరీక్షనూ ఆన్‌లైన్‌లోనే నిర్వహిస్తారు. ఇందులో 2 పేపర్లు ఉంటాయి. పేపర్‌-1 అందరికీ తప్పనిసరి. జూనియర్‌ స్టాటిస్టికల్‌ ఆఫీసర్, స్టాటిస్టికల్‌ ఇన్వెస్టిగేటర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నవారు పేపర్‌-2 (స్టాటిస్టిక్స్‌) రాయాలి. 

పేపర్‌-1: సెక్షన్‌-1లో మ్యాథమెటికల్‌ ఎబిలిటీస్‌ 30, రీజనింగ్‌ అండ్‌ జనరల్‌ ఇంటెలిజెన్స్‌ 30 మొత్తం 60 ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకు 3 చొప్పున 180 మార్కులకు ఈ సెక్షన్‌ ఉంటుంది. సెక్షన్‌-2లో ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ అండ్‌ కాంప్రహెన్షన్‌ నుంచి 45, జనరల్‌ అవేర్‌నెస్‌ 25 ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకు 3 చొప్పున 70 ప్రశ్నలకు 210 మార్కులు. వ్యవధి గంట. సెక్షన్‌-3 మాడ్యూల్‌-1లో కంప్యూటర్‌ నాలెడ్జ్‌ 20 ప్రశ్నలు వస్తాయి. వీటికి 60 మార్కులు. వ్యవధి 15 నిమిషాలు. అన్ని సెక్షన్లలోనూ ప్రతి తప్పు సమాధానానికీ ఒక మార్కు తగ్గిస్తారు. సెక్షన్‌-3 మాడ్యూల్‌-2లో డేటా ఎంట్రీ స్పీడ్‌ టెస్టు 15 నిమిషాల వ్యవధితో నిర్వహిస్తారు. ఇచ్చిన సమాచారాన్ని 15 నిమిషాల్లో టైప్‌ చేయాలి. ఇందులో అర్హత సాధిస్తే చాలు. 
పేపర్‌-2: స్టాటిస్టిక్స్‌ నుంచి వంద ప్రశ్నలు ఉంటాయి. వీటికి 200 మార్కులు. వ్యవధి 2 గంటలు. ప్రతి తప్పు సమాధానానికీ అర మార్కు తగ్గిస్తారు. 

టైర్‌-1, టైర్‌-2 పరీక్షల్లో అర్హత సాధించడానికి  అన్‌ రిజర్వ్‌డ్‌ 30, ఓబీసీ, ఈడబ్ల్యుఎస్‌లు 25, ఇతరులు 20 శాతం మార్కులు పొందాలి. 

పలు విభాగాల్లో ఇన్‌స్పెక్టర్, సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులకు పోటీ పడేవారికి నిర్దేశిత శారీరక ప్రమాణాలు తప్పనిసరి. వీరికి పరీక్షల తర్వాత ఫిజికల్, మెడికల్‌ టెస్టులు నిర్వహిస్తారు.

సన్నద్ధత మెలకువలు 

  • నోటిఫికేషన్‌లో సిలబస్‌ వివరాలు క్షుణ్నంగా గమనించాలి. 
  • టైర్‌-1, టైర్‌-2ల్లోని ఉమ్మడి అంశాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. 
  • ఆచరణకు వీలయ్యేలా రోజువారీ ప్రణాళిక రూపొందించుకుని, పరీక్ష తేదీ వరకు దాన్ని అమలు చేయాలి. 
  • తాజా అభ్యర్థులైతే సిలబస్‌లోని విభాగాలవారీ ప్రాథమికాంశాలతో అధ్యయనం ప్రారంభించాలి. 
  • ఏదైనా విభాగం నుంచి ఒక అంశాన్ని నేర్చుకున్న తర్వాత అందులో వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధన చేయాలి. అనంతరం ఆ అంశంలోనే మాక్‌ పరీక్ష రాయాలి. అందులో 80 శాతం స్కోరు పొందితే తర్వాత అంశంలోకి వెళ్లాలి. ఇదే పద్ధతిని అన్ని విభాగాల్లోనూ కొనసాగించాలి. 
  • పాత ప్రశ్నపత్రాలు బాగా అధ్యయనం చేయాలి. విభాగాల్లోని అంశాలవారీ లభిస్తోన్న ప్రాధాన్యం గుర్తించి, ఎక్కువ ప్రశ్నలు వస్తోన్న అంశాలపై మరింత దృష్టి సారించాలి. 
  • పరీక్షకు ముందు కనీసం పది మాక్‌ టెస్టులు రాసి, ఫలితాలు విశ్లేషించుకోవాలి. వెనుకబడుతోన్న విభాగాలపై అధిక దృష్టి సారించి, తప్పులు పునరావృతం కాకుండా చూసుకోవాలి. ముందు పరీక్షకు, తర్వాత పరీక్షకు స్కోరులో గుణాత్మక మార్పులు ఉంటే మీ అధ్యయనం బాగున్నట్లే.  
  • పరీక్ష తేదీకి పది రోజులు ఉన్నప్పటి నుంచి పూర్తి సమయాన్ని పునశ్చరణ (రివిజన్‌) కోసమే కేటాయించాలి. సన్నద్ధత ఎంత గొప్పగా ఉన్నప్పటికీ రివిజన్‌ లేకపోతే వచ్చిన అంశాల్లోనే పొరపాట్లు జరిగే ప్రమాదం ఉంది.

ఆబ్జెక్టివ్‌ పరీక్షలో విజయానికి వేగం, కచ్చితత్వం కీలకం. ఈ రెండింటి మధ్య సమన్వయం అవసరం. వేగం కోసం కచ్చితత్వాన్ని వదిలేస్తే తప్పులు జరుగుతాయి. దీంతో ఒక మార్కు పొందాల్సిన చోట పావు మార్కు కోల్పోతారు. అలాగే కచ్చితత్వం కోసం ఉన్న సమయాన్ని పరిగణనలోకి తీసుకోకపోతే వచ్చిన ప్రశ్నలనే వదులుకోవాలి. వేగం, కచ్చితత్వం ఈ రెండు అలవడటానికి వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధన చేయడమే మార్గం.

ప్రశ్నాంశాలు

జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌: ఎక్కువ మార్కులు పొందే వీలున్న విభాగమిదే. నాన్‌ వెర్బల్‌ సిరీస్, అనాలజీ, కోడింగ్‌-డీకోడింగ్, ఆడ్‌మన్‌ అవుట్‌ల నుంచే దాదాపు 70 శాతం ప్రశ్నలు వస్తాయి. క్లాక్, క్యాలెండర్, రక్త సంబంధాలు, దిక్కులు, క్యూబ్స్, డైస్, వెన్‌ చిత్రాలు, కౌంటింగ్‌ ఫిగర్స్, పజిల్స్, సిలాజిజమ్, ర్యాంకింగ్, సీక్వెన్స్‌ నుంచి మిగిలిన 30 శాతం ప్రశ్నలు ఉంటాయి. ప్రతి అంశం నుంచీ కనీసం ఒక ప్రశ్న అడుగుతారు. ఇచ్చిన సమాచారం ఆధారంగా బాగా ఆలోచించి, తర్కం ఉపయోగించి సమాధానం గుర్తించవచ్చు. 

జనరల్‌ అవేర్‌నెస్‌: పర్యావరణం, వర్తమాన అంశాలు, రోజువారీ సంఘటనలు, భారతదేశం, పొరుగు దేశాలతో సంబంధాలు... వీటిపై ఎక్కువ ప్రశ్నలు సంధిస్తారు. దినపత్రికలు చదివే అలవాటు ఉన్నవారు ఈ విభాగంలో ఎక్కువ స్కోర్‌ చేయవచ్చు. వాటిని చదువుతున్నప్పుడే ముఖ్యాంశాలు రాసుకుంటే గుర్తుంటాయి. చరిత్ర, సంస్కృతి, జాగ్రఫీ, ఎకనామిక్స్, జనరల్‌ పాలసీ అండ్‌ సైంటిఫిక్‌ రిసెర్చ్‌ విభాగాల్లోనూ ప్రశ్నలు వస్తాయి. చరిత్రలో.. భారతదేశ చరిత్ర, మధ్యయుగం, ఆధునిక యుగం బాగా చదవాలి. రాజ్యాలు, స్థాపకులు, యుద్ధాలు, గవర్నర్‌ జనరల్, గాంధీ యుగం, ఉద్యమాలు ముఖ్యమైనవి. భూగోళశాస్త్రం నుంచి.. నదులు, పర్వతాలు, నేలలు, సరిహద్దులు, అడవులు, వాతావరణం, పక్షులు, జంతు సంరక్షణ, పరిరక్షణ.. సంబంధిత అంశాలు అధ్యయనం చేయాలి. పాలిటీలో.. పౌరులు, ప్రాథమిక హక్కులు, రాష్ట్రపతి, పార్లమెంట్, అధికరణలు, సవరణలు ముఖ్యమైనవి. ఎకానమీలో డిమాండ్‌- సప్లై, ద్రవ్యోల్బణం, పేదరికం, మార్కెట్‌ రకాలు, జాతీయ, అంతర్జాతీయ సమకాలీనాంశాలపై దృష్టి సారించాలి. వర్తమాన వ్యవహారాల్లో.. వార్తల్లోని వ్యక్తులు, ఎన్నికలు, క్రీడలు, అవార్డులు, పథకాలు, దేశాలు- రాజధానులు, కరెన్సీలు, ప్రధాని/అధ్యక్షుడు, రాజధాని..మొదలైనవి చూసుకోవాలి. సైన్స్‌లో కొత్త ఆవిష్కరణలు, తాజా పరిణామాలు ముఖ్యమైనవి.

క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌: ఈ విభాగంలో రాణించడానికి తక్కువ సమయంలో ఎక్కువ ప్రశ్నలకు జవాబులు గుర్తించగలిగే నైపుణ్యం అవసరం. సూక్ష్మీకరణలపై పట్టు సాధించాలి. ప్రశ్నను బట్టి సూత్రం లేదా తర్కం ఉపయోగించి సమాధానం గుర్తించడం అలవాటు చేసుకోవాలి. డేటా అనాలిసిస్, డేటా సఫిషియన్సీల నుంచి 7-10 వరకు ప్రశ్నలు ఉంటాయి. శాతాలు, నిష్పత్తి-అనుపాతం, లాభ-నష్టాలు, చక్రవడ్డీ, బారువడ్డీ, కాలం-దూరం, కాలం-పని, పడవలు-ప్రవాహాలు, రైళ్లు, సరాసరి, వ్యాపార భాగస్వామ్యం ఇలా ప్రతి అంశం నుంచి ఒక ప్రశ్న రావొచ్చు. వైశాల్యాలు, వాల్యూమ్స్‌ నుంచి 3-4 ప్రశ్నలు ఉంటాయి. 

ఇంగ్లిష్‌ కాంప్రహెన్షన్‌: వ్యాకరణాంశాల్లో పట్టు పెంచుకోవాలి. వేగంగా చదివి, సమాచారాన్ని సంగ్రహించే నైపుణ్యం సొంతమైతే కాంప్రహెన్షన్‌లో ఎక్కువ మార్కులు పొందవచ్చు. ఆంగ్ల దినపత్రికలు చదవడం, వార్తలు వినడం ద్వారా భాషపై పట్టు పెంచుకోవడానికి ప్రయత్నించాలి. కాంప్రహెన్షన్‌ నుంచి 5, క్లోజ్‌ టెస్టు నుంచి 4, జంబుల్డ్‌ సెంటెన్స్‌లో 3, సెంటెన్స్‌ ఇంప్రూవ్‌మెంట్‌/కరెక్షన్‌ నుంచి 3 ప్రశ్నలు రావచ్చు. మిగిలినవి వ్యాకరణాంశాల నుంచి ఉంటాయి. వర్డ్‌ సబ్‌స్టిట్యూషన్, ఇడియమ్స్‌ అండ్‌ ఫ్రేజెస్, సిననిమ్స్‌- యాంటనిమ్స్, వాయిస్, డైరెక్ట్, ఇండైరెక్ట్‌ స్పీచ్‌ల నుంచి వీటిని అడుగుతారు.

ముఖ్య వివరాలు

అర్హత: ఏదైనా బ్యాచిలర్‌ డిగ్రీ. జూనియర్‌ స్టాటిస్టికల్‌ ఆఫీసర్‌కు డిగ్రీలో స్టాటిస్టిక్స్‌ లేదా ఇంటర్‌ మ్యాథ్స్‌లో 60 శాతం మార్కులుండాలి. స్టాటిస్టికల్‌ ఇన్వెస్టిగేటర్‌ కు డిగ్రీలో స్టాటిస్టిక్స్‌ తప్పనిసరి.

వయసు: ఆగస్టు 1, 2024 నాటికి గ్రూప్‌-బీలో.. జూనియర్‌ స్టాటిస్టికల్‌ ఆఫీసర్‌కు 32, మిగిలిన పోస్టులకు 30 ఏళ్లలోపు వయసు ఉండాలి. గ్రూప్‌-సీలో ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టుకు 30 ఏళ్లు. మిగిలినవాటికి 27 ఏళ్లలోపువాళ్లే అర్హులు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు వారి కేటరిగీ ప్రకారం పది నుంచి పదిహేనేళ్లు గరిష్ఠ వయసులో మినహాయింపు లభిస్తుంది. 

ఆన్‌లైన్‌ దరఖాస్తులు: జులై 24 రాత్రి 11 వరకు స్వీకరిస్తారు.

దరఖాస్తు రుసుం: రూ.వంద. మహిళలు,  ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు మినహాయించారు. 

పరీక్షలు: టైర్‌-1 సెప్టెంబరు-అక్టోబరులో,  టైర్‌-2 డిసెంబరులో. 

పరీక్ష కేంద్రాలు: ఏపీలో.. చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమహేంద్రవరం, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం. తెలంగాణలో.. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్‌. 

వెబ్‌సైట్‌: http://ssc.gov.in/


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని