AP TET 2024: ఏపీలో టెట్‌ నోటిఫికేషన్‌ విడుదలకు రంగం సిద్ధం

ఏపీలో కొత్తగా నిర్వహించనున్న టెట్ నోటిఫికేషన్‌ విడుదలకు రంగం సిద్ధమైంది. జులై 1న నోటిఫికేషన్‌, 2న సమాచార బులెటిన్‌ విడుదల చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.

Updated : 30 Jun 2024 21:59 IST

అమరావతి: ఏపీలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (AP TET 2024) కొత్త నోటిఫికేషన్‌ విడుదలకు రంగం సిద్ధమైంది. జులై 1న టెట్‌ నోటిఫికేషన్‌, 2న సమాచార బులెటిన్‌ విడుదల చేయనున్నారు. నోటిఫికేషన్‌, ఇన్ఫర్మేషన్‌ బులెటిన్‌, షెడ్యూల్‌, దరఖాస్తుల స్వీకరణ, సిలబస్‌తో పాటు ఆన్‌లైన్‌లో జరిగే ఈ పరీక్షపై అభ్యర్థులకు తగిన సూచనలు, విధివిధానాలను విద్యాశాఖ అధికారులు ఖరారు చేశారు. ఈ సమాచారాన్ని జులై 2 నుంచి https://cse.ap.gov.in/ వెబ్‌సైట్‌ ద్వారా పొందవచ్చని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సురేష్‌ కుమార్‌ ఆదివారం ఓ ప్రకటనలో వెల్లడించారు. అదనపు సమాచారం కోసం కమిషనర్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్‌డెస్క్‌ను సంప్రదించవచ్చని సూచించారు. 

రాష్ట్రంలో ఫిబ్రవరి 27 నుంచి మార్చి 6వరకు గత ప్రభుత్వం టెట్‌ నిర్వహించగా.. 2.35లక్షల మంది హాజరైతే, వారిలో 1,37,903 మంది (58.46శాతం) అర్హత సాధించారు. అయితే, కొత్త ప్రభుత్వం పాత డీఎస్సీని రద్దు చేసి, కొత్తగా 16,347 టీచర్‌ పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించిన నేపథ్యంలో తాజాగా బీఈడీ, డీఎడ్‌ పాసైన అభ్యర్థులతో పాటు ఇటీవల టెట్‌లో ఫెయిలైన వారికి అవకాశం కల్పిస్తూ కొత్తగా టెట్‌ నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. డీఎస్సీలో టెట్‌ మార్కులకు 20శాతం వెయిటేజీ ఉంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని