AP DSC: ఆంధ్రప్రదేశ్‌ టెట్‌, మెగా డీఎస్సీపై ప్రభుత్వం కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్‌లో టెట్, మెగా డీఎస్సీ పరీక్షలకు సమయమివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

Updated : 03 Jul 2024 18:02 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో టెట్, మెగా డీఎస్సీ పరీక్షలకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు అభ్యర్థులకు సమయమివ్వాలని నిర్ణయించింది. అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. త్వరలోనే టెట్‌, డీఎస్సీ పరీక్షల తేదీలను ప్రకటించనుంది. ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేసిన వెంటనే 16,347 టీచర్‌ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ ఫైల్‌పై తొలి సంతకం చేసిన విషయం తెలిసిందే. ఈ మొత్తం ప్రక్రియ 6 నెలల్లో పూర్తిచేసేలా కార్యాచరణ రూపొందించాలని మంత్రి నారా లోకేశ్‌ అధికారులను ఆదేశించారు. కొత్తగా బీఈడీ, డీఎడ్‌ పూర్తి చేసుకున్న వారికీ మెగా డీఎస్సీలో అవకాశం కల్పించనున్నారు. 

టెట్‌, మెగా డీఎస్సీ పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు మరింత సమయం కావాలని విద్యార్థి, యువజన సంఘాల నేతలు, పలువురు ఎమ్మెల్సీలు లోకేశ్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. ప్రిపరేషన్‌కు సమయం ఇస్తే బాగుంటుందని కోరడంతో వారి విజ్ఞప్తుల్ని పరిశీలించిన ఆయన.. విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమీక్షించారు. అభ్యర్థులకు టెట్‌కు 90 రోజులు, మెగా డీఎస్సీకి 90 రోజుల సమయం ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. త్వరలోనే టెట్, డీఎస్సీ నిర్వహణకు కొత్త తేదీలను ప్రభుత్వం ప్రకటించనుంది. మొత్తంగా ఈ ఏడాది డిసెంబర్‌లోగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పూర్తి చేసి 2025 జనవరి నాటికి ఉద్యోగాలు ఇచ్చేలా కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులను మంత్రి లోకేశ్‌ ఆదేశించినట్లు సమాచారం.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని